మామిళ్లగూడెం, ఏప్రిల్ 29: పోలీసు శాఖలో స్టెఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ (ఎస్సీటీపీసీ) అభ్యర్థుల తుది రాత పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రిలిమ్స్, దేహదార్యుడ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి, జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఆదివారం తుది రాత పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష నిర్వహణకు సమస్యలు తలెత్తకుండా సీపీ విష్ణు ఎస్ వారియర్ ఆధ్వర్యంలో 150 మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం పరిసరాల్లోని 21 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షకు12,156 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. పరీక్ష జరిగే సమయంలో పరీక్ష నిర్వహణ, పర్యవేక్షణ అధికారులు మినహా కేంద్రంలోనికి ఎవరికీ అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా పరీక్ష సమయానికి గంట ముందే టెక్నికల్ బృంద సభ్యులు అభ్యర్థుల బయోమెట్రిక్, ఫింగర్ ఫ్రింట్స్, ఫొటో ఐడెంటిఫికేషన్ పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల నుంచి పరీక్ష ప్రక్రియ ముగిసే వరకు భద్రతా ఏర్పాట్లను అందించాలని రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పరీక్షా కేంద్రాలకు 500 మీటర్ల లోపల ఉన్న జిరాక్స్ సెంటర్లు, నెట్ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిఘాను పర్యవేక్షించేందుకు ఎస్బీ ఫీల్డ్ స్టాఫ్ని నియమించారు.
కానిస్టేబుల్ పోస్టుల తుది రాత పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు హాల్టికెట్లో ఉన్న నియమ నిబంధనలను పాటించాలి. ప్రధానంగా అభ్యర్థులు చేతులకు గోరింటాకు, మెహంది వంటివి పెట్టుకోవడం వల్ల బయోమెట్రిక్లో వేలి ముద్ర సరిగా వచ్చే అవకాశం ఉండదు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే ఎవరినీ నమ్మకూడదు. అభ్యర్థుల సౌలభ్యం కోసం పరీక్షా కేంద్రాలు దూరంగా ఉంటే రైల్వేస్టేషన్, బస్టాండ్ల నుంచి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపిస్తారు. అభ్యర్థులుగానీ, డ్యూటీ అధికారులుగానీ పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లడానికి అనుమతిలేదు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ విష్ణు ఎస్ వారియర్ శనివారం తెలిపారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో మొత్తం 21 పరీక్షా కేంద్రాల వద్ద ఆదివారం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 144 సెక్షన్ను అమలు చేయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల సమీపంలో సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదు.