ఖమ్మం, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18వ తేదీ గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణకు ఐడీవోసీలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ సునీల్దత్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. 21వ తేదీన ఆదివారం మినహాయించి, మిగతా 7రోజులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థికి సంబంధించి 3 వాహనాలను మాత్రమే అనుమతి ఉందని, మిగతా వాహనాలు 100 మీటర్ల దూరంలో ఉండాలని సూచించారు.
కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు, రిటర్నింగ్ అధికారి చాంబర్లో ఒకేసారి ఐదుగురికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. 26వ తేదీ స్రూటీని ప్రక్రియ ఉంటుందని, 29వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉందన్నారు. ఈ నెల 17న వ్యయ పరిశీలకులు, 23న సాధారణ, పోలీస్ పరిశీలకులు జిల్లాకు రానున్నట్లు తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు సాధారణ ప్రజలు కలెక్టరేట్కు రావద్దని సూచించారు. పోలీస్ కమిషనర్ సునీల్దత్ మాట్లాడుతూ ఫ్లయింగ్ స్వాడ్ బృందాలు క్రియాశీలకంగా పని చేస్తున్నాయని తెలిపారు. ఎస్ఎస్టీ టీములు 18వ తేదీ నుంచి పని చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్సింగ్, యువరాజ్, మిర్నల్ శ్రేష్ఠ, జిల్లా పౌరసంబంధాల అధికారి ఎంఏ గౌస్, జిల్లా ఉపాధికల్పన అధికారి కె.శ్రీరామ్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, మదన్గోపాల్, అధికారులు పాల్గొన్నారు.