‘రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బందికి ఒకటో తారీఖునే జీతాలు చెల్లించాం. చిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాం.’ ఇవీ.. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చెబుతున్న మాటలు. సీన్ కట్ చేస్తే.. వారి మాటలు నీటి మీద రాతలేనని తేలిపోయాయి. ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్ తదితర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న వందలాది అల్ప జీతాల జీవులు నెలల తరబడి వేతనాలు అందక అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఖమ్మం నుంచి మొదలు పెడితే జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న బెడ్ సైడ్ కార్మికులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుసంధామైన 104 విభాగ యంత్రాంగం, మరికొంత మంది నర్సింగ్ ఆఫీసర్లు అందరూ ప్రభుత్వ ప్రకటనతో సంబురపడినప్పటికీ ఆచరణలోకి తొంగిచూసి మోసపోయామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆరు అబద్ధపు గ్యారెంటీలు, 420 హామీలతో కోట్లాది మందిని ముంచి గద్దెనెక్కిన కాంగ్రెస్ తమ ఆశల్ని సైతం ఆదిలోనే తుంచివేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం సిటీ, జూలై 3 ; ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా 104 విభాగంలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందిలోని కొందరిని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేశారు. మరికొందరు ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల పరిధిలోని టీ హబ్, వైద్య పరీక్షల విభాగాల్లో ల్యాబ్ టెక్నీషియన్లుగా, ఫార్మాసిస్టులుగా పనిచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వీరి సంఖ్య దాదాపు 120 వరకు ఉంటుంది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వీరికి నెలనెలా వేతనాలు అందిన దాఖలాల్లేవు. ల్యాబ్ టెక్నీషియన్లకు ఎనిమిది నుంచి 12 నెలలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఆరు నెలల వేతనాలు బకాయిలుగా ఉన్నాయి. అదేవిధంగా ఖమ్మం, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, మధిర, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుధ్యం, పేషెంట్ కేర్ తదితర పనులు చేస్తున్న బెడ్ సైడ్ కార్మికులు మొత్తం 467 మంది ఉన్నారు. వీరికి కూడా నెలల తరబడి పెండింగ్లో ఉంచుతున్నారు. వీరు ఆందోళనలు, ధర్నాలు చేసినప్పుడు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నారు. అనునిత్యం రోగులకు సేవలు అందిస్తూ, అన్నిరకాల వ్యర్థాలను తొలగించి దవాఖానలను పరిశుభ్రంగా ఉంచుతున్న బడుగు జీవులను పట్టించుకున్న పాపానపోవడం లేదు. ఇటీవల ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఒకటో తారీఖునే వారి ఖాతాల్లో వేతనాలను జమ చేస్తామని ఎంతో గొప్పగా ప్రకటనలు చేసినప్పటికీ.. వైద్య విభాగపు చిరుద్యోగులకు మొండిచేయి దర్శనమివ్వడం గమనార్హం.
ఏజెన్సీలను రద్దు చేయకుండా సాధ్యమెలా?
ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయకుండా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వ్యవస్థను ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ప్రధానంగా మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్యారోగ్య శాఖల్లో ఎక్కువగా ఈ తరహా సిబ్బంది పనిచేస్తుంటారు. దీనికి గాను వారి వేతనాల బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తుంది. నిబంధనల ప్రకారం ఎవరైతే కాంట్రాక్టు దక్కించుకుంటారో సదరు గుత్తేదారే.. చిరుద్యోగులకు నెలనెలా వేతనాలు చెల్లించాలి. ఆ మొత్తానికి కొంత కమీషన్ కలిపి ఏజెన్సీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది బతుకులు ఆగమాగంగా మారాయి. తాజాగా ప్రభుత్వమే నేరుగా వారి ఖాతాల్లోకి ఒకటో తారీఖునే వేతనాలు జమ చేస్తుందని చేసిన ప్రకటనను సహజంగానే చిరుద్యోగులు తీపికబురుగా భావించారు. కానీ, అదంతా మోసమని గ్రహించేందుకు ఎంతో కాలం పట్టలేదు. ఇదే అంశంపై వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే ‘కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయకుండా వేతనాలు ఎలా ఇస్తారు?’ అని ఎదురు ప్రశ్న వేస్తుండడం గమనార్హం. పాలనాపరమైన అంశాల్లో భాగంగా కీలక ప్రకటన చేసేముందు ఒకటికి రెండు దఫాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని సెలవిస్తున్నారు. అంతా తెలుసుకున్న వైద్యారోగ్యశాఖ సిబ్బంది, ఉదోగ సంఘాల నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం పట్ల అగ్గిమీద గుగ్గిలమై మండిపడుతున్నారు.