ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 28: ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు మాకొద్దంటూ ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ క్యాంపు పాఠశాల విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఈ అన్నం తినలేమని, మెనూ ప్రకారం వడ్డించాలని నినాదాలు చేశారు. దీనికి పీడీఎస్యూ నాయకులు మద్దతు తెలపడంతో సుమారు 2 గంటలపాటు విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు.
వివరాలు తెలుసుకున్న డీఈవో సోమశేఖర శర్మ పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులను మందలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మళ్లీ భోజనం వండించి విద్యార్థులకు వడ్డించడంతో వారు శాంతించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ బడి పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, అధికారులు పర్యవేక్షించి నాణ్యమైన భోజనం అందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.