సత్తుపల్లి, మే 7: సింగరేణి యాజమాన్యానికి రూ.41.21 కోట్ల జరిమానా విధిస్తూ శుక్రవారం చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పునిచ్చింది. తెలిసిన వివరాల ప్రకారం.. 2020 సెప్టెంబర్లో సింగరేణి యాజమాన్యం నియమ, నిబంధనలు పాటించకుండా సత్తుపల్లిలోని ఎన్టీఆర్నగర్ సమీపంలో బాంబ్ బ్లాస్టింగ్స్ చేసింది. ఘటనలో అనేక గృహాలు దెబ్బతిన్నాయి. దీనిపై ఆటోడ్రైవర్ బానోత్ నందూనాయక్ చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించాడు.
a 17 నెలల వ్యవధిలో కేసు వాయిదాలు పడుతూ వచ్చింది. శుక్రవారం ఎట్టకేలకు జస్టిస్ రామకృష్ణన్, సత్యగోపాల్ కొర్లపాటి ధర్మాసనం పైవిధంగా సింగరేణి యాజమాన్యానికి జరిమానా విధించింది. నిర్ణీత కాలంలోపు ఆ మొత్తాన్ని చెల్లించకపోతే రికవరీ బాధ్యతలు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్బోర్డు చేపట్టాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను స్వాగతిస్తూ పిటిషనర్ బానోత్ నందూనాయక్, సహచరుడు పాలడుగు దుర్గాప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఎన్టీఆర్ నగర్ వాసులతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.