ఖమ్మం, మార్చి 17 : రాముడి పేరుతో రాజకీయం చేసే ఎన్డీఏ ప్రభుత్వం.. అదే రాముడు నడయాడిన భద్రాచలం క్షేత్రంతోపాటు, తెలంగాణలోని రైల్వే సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉపనేత వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. బడ్జెట్లో రైల్వేశాఖకు కేటాయించిన నిధులపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన తెలంగాణకు సంబంధించిన పలు రైల్వే సమస్యలను ప్రస్తావించారు.
రఘుపతి రాఘవ రాజారామ్ అనే రాముడి కావ్యంతో చర్చను ప్రారంభించిన వద్దిరాజు దక్షిణ అయోధ్యగా పిలవబడే భద్రాచలం క్షేత్రానికి రైలుమార్గం అనుసంధానించే భద్రాచలం- కొవ్వూరు రైల్వేలైన్ దశాబ్దాల నుంచి కలగా ఉంటోందని, ఈ కల సాకారం కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని చెప్పారు. భద్రాచల క్షేత్రం ప్రాశస్త్యాన్ని గుర్తించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లాల పునర్విభజన కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా నామకరణం చేసి రాముడిపై తనకున్న అపార భక్తిని చాటుకున్నారని గుర్తుచేశారు.
రైల్వే ఆదాయానికి అధికశాతం నిధులు సమకూరుస్తున్నా తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయడం లేదని వాపోయారు. ఉత్తర, దక్షిణ భారతదేశానికి ప్రవేశ ద్వారంగా ఉన్న కాజీపేటను రైల్వే డివిజన్గా గుర్తించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉందన్నారు. దక్షిణ మధ్యరైల్వేకు 48శాతం ఆదాయం సమకూరుస్తున్న కాజీపేటను ప్రత్యేక డివిజన్గా గుర్తిస్తే.. లాభదాయకంగా ఉంటుందని రవిచంద్ర ప్రస్తావించారు.
సిద్దిపేట జిల్లాలో చిన్న కోడూరు రైల్వేస్టేషన్ మంజూరు, నిజామాబాద్, మంచిర్యాల, భద్రాచలం రోడ్ నుంచి తిరుపతికి నూతన రైలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల వేగవంతం, కొత్త బ్రిడ్జిల మంజూరు, రైల్వేస్టేషన్లలో తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాల కల్పనపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని రవిచంద్ర కోరారు.