సత్తుపల్లి టౌన్, జనవరి 23: సత్తుపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు ఒకరిపై మరొకరు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించిన వారికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ విషయాన్ని భవన నిర్మాణ యజమానులు జిల్లా సీనియర్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కాంగ్రెస్ నాయకులపైనా, వారి అనుచరులపైనా మంత్రి సీరియస్ అయినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి..
సత్తుపల్లికి చెందిన కొందరు పట్టణంలోని గుడిపాడు రోడ్డులో అనేక వీధుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి సెట్బ్యాక్ లేకుండా ఆరు అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. సత్తుపల్లి పట్టణంలో జీ ప్లస్ 2కు మాత్రమే అనుమతులు ఇచ్చే అవకాశం ఇక్కడి మున్సిపల్ అధికారులకు ఉంటుంది. అంతకుమించి భవనాలు నిర్మించాలంటే వరంగల్, హైదరాబాద్లలోని ప్రాంతీయ, ప్రధాన కార్యాలయాల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. అక్కడి అధికారులు కూడా ప్లానింగ్ పరిశీలన అనంతరం జీ ప్లస్ 5కు మాత్రమే అనుమతులు ఇస్తారు. అయితే స్థానిక మున్సిపల్ అధికారుల అనుమతులు తెచ్చుకున్న వారు జీ ప్లస్ 5 నిర్మాణాలు చేపడుతున్నారు. వరంగల్, హైదరాబాద్ నుంచి అనుమతులు తెచ్చుకున్న వారు జీ ప్లస్ 6 స్లాబులు వేస్తున్నారు. వీరిలో కాంగ్రెస్ వ్యక్తులు ఉండడంతో ఒకరిపై మరొకరు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. పట్టణ నడిబొడ్డున ఇన్నాళ్లూ ఇంత పెద్ద నిర్మాణాలు జరుగుతున్నా చూసీ చూడనట్లు వ్యవహరించిన మున్సిపల్ అధికారులు.. అధికార పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించారు. ఆ తరువాత భవనాల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వాటి తొలగిస్తామంటూ స్పష్టం చేస్తున్నారు. అయితే, తొలుత జీ ప్లస్ 2 నిర్మాణ అనుమతుల కోసం చూపించిన స్థలం, సర్వే నెంబర్లలో కాకుండా మరో ప్రాంతంలో, వేరే సర్వే నెంబర్లలో నిర్మాణాలు జరుగుతున్నాయని మున్సిపల్ అధికారులు ఫిర్యాదు అందాయి. అయితే సదరు భవన నిర్మాణదారుడు చూపించిన సర్వే నెంబర్ల వివరాలను ఇవ్వాలని తహసీల్దార్కు స్థానిక మున్సిపల్ అధికారులు కోరారు. తహసీల్దార్ పంపే నివేదికను పరిశీలిస్తామని, సదరు నిర్మాణదారుడు మరో ప్రాంతంలో భవనాన్ని నిర్మిస్తున్నట్లు గుర్తిస్తే ఆ నిర్మాణాలను తొలగిస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
కాగా, మున్సిపల్ అధికారులు జారీ చేసిన నోటీసులు తీసుకొని సదరు భవన నిర్మాణ యజమానులు సీనియర్ మంత్రి వద్దకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేశారు. భవన నిర్మాణాలు, అనుమతులు వంటి విషయాల్లో ఎందుకు తలదూర్చారంటూ సీరియర్ అయినట్లు తెలిసింది.
సత్తుపల్లిలో సర్వే నెంబరు తప్పుగా చూపించి మున్సిపల్ శాఖ నుంచి తీసుకున్న పర్మిషన్ కంటే అదనంగా అంతస్తులు నిర్మిస్తున్నారని మాకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నాం. అనుమతులను అతిక్రమించి అంతస్తులు నిర్మించినందుకు ఇప్పటికే సంబంధిత యజమానికి నోటీసులు జారీచేశాం. అదేవిధంగా చూపించిన సర్వే నెంబరులో కాకుండా వేరే సర్వేనెంబరులో నిర్మాణం జరిపించారనే మరో ఫిర్యాదుపై కూడా తహసీల్దార్ను వివరాలు అడిగాం. సర్వే నెంబరు తప్పుగా ఉన్నట్లయితే భవన నిర్మాణాన్ని తొలగిస్తాం.