భద్రాచలం, డిసెంబర్ 18 : భద్రాద్రి దివ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిరోజు రామయ్యకు దశావతారాల్లోని అవతారాలను ధరింపజేసి.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఆరో రోజు స్వామివారిని పరశురాముడిగా అలంకరించారు. సోమవారం సందర్భంగా అంతరాలయంలోని మూలవరులకు బెంగుళూరు భక్తులు రూ.30 లక్షలతో తయారు చేయించి సమర్పించిన ముత్యాలు పొదిగిన ప్రత్యేక తొడుగులను ధరింపజేశారు. ఉదయం స్వామివారి ఉత్సవ మూర్తులు(స్వర్ణ మూర్తులు), నిత్య కల్యాణ మూర్తులకు బేడా మండపంలో అభిషేక తిరుమంజనం చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని అంతరాలయంలోనికి తీసుకెళ్లి పరశురామునిగా అలంకరించి బేడా మండపంలో వేంచేపు చేశారు. పరశురామునిగా ఉన్న రామయ్యను భక్తులు దర్శించుకొని తరించారు. ఆ తర్వాత అంతరాలయంలోనికి తీసుకెళ్లి రాజభోగం సమర్పించారు. మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారిని సమస్త మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణలు, కోలాట నృత్యాల నడుమ గోదావరి నది తీరానికి తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో హారతులు సమర్పించారు. తిరిగి మిథిలా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామివారిని ఆశీనులను చేసి హారతులు ఇచ్చి, ప్రత్యేక పూజలు చేపట్టారు. పరశురాముడిగా దర్శనమిస్తున్న స్వామివారిని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం తిరువీధి సేవను తాతగుడి సెంటర్ వరకు జరిపారు. పరశురాముడిగా దర్శనమిస్తున్న స్వామివారిని కనులారా దర్శించుకునేందుకు భక్తులు రహదారుల కిరువైపులా నిలిచి మదినిండా తలచుకుంటూ పరవశించిపోయారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ ఎల్.రమాదేవి, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్, ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ఈఈ రవీందర్, ఆలయ పర్యవేక్షకుడు లింగాల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
పర్ణశాల, డిసెంబర్ 18 : భద్రాచలం పుణ్యక్షేత్రానికి అనుబంధ ఆలయమైన పర్ణశాల క్షేత్రంలో జరిగే ముక్కోటి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం పరిశీలించారు. తొలుత ఆయన ఉత్తర ద్వార దర్శనం జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. వైకుంఠ దర్శనం విషయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి ఇన్స్పెక్టర్కు తగిన సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో సీఐ దోమల రమేశ్, పర్ణశాల ఆలయ ప్రత్యేకాధికారులు, ఏఈవో శ్రావణ్కుమార్, అనిల్కుమార్, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
పర్ణశాలలో& పర్ణశాల, డిసెంబర్ 18 : ముక్కోటి ఉత్సవాల సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల ఆలయంలో రామయ్య సోమవారం పరశురామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు ఈ రూపంపై భక్తులకు వివరించారు. శుక్రగ్రహ బాధలున్నవారు ఈ అవతారాలున్న రాముడిని దర్శించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారని తెలిపారు. సాయంత్రం 3 గంటలకు అర్చకులు తిరువీధి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు శేష కిరణ్ కుమార్ చార్యులు, భరద్వాజ్ చార్యులు, అమరవాది శ్రీకాంత్ చార్యులు, నరసింహాచార్యులు, రాజగోపాలాచార్యులు, ఏఈవో శ్రవణ్కుమార్, అనిల్, కిశోర్, గుమస్తా ప్రసాద్, సిబ్బంది రాము, శివ పాల్గొన్నారు.
భద్రాచలం, డిసెంబర్ 18 : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 22న అత్యంత వైభవోపేతంగా నిర్వహించే తెప్పోత్సవం, 23న నేత్రపర్వంగా జరిపే ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లను ఏఎస్పీ పరితోష్ పంకజ్.. దేవస్థానం ఈవో ఎల్.రమాదేవితో కలిసి పరిశీలించారు. సెక్టార్ల ఏర్పాట్ల గురించి ఈఈ రవీందర్రాజును అడిగి తెలుసుకున్నారు. అలాగే వీవీఐపీ సెక్టార్లో భద్రత, సీసీ కెమెరాల ఏర్పాట్ల గురించి చర్చించారు. కాగా.. ఉత్తర ద్వార దర్శనానికి నూతన మంత్రులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లు సమాచారం.