కూసుమంచి, జూన్ 15: స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రతి గ్రామంలో సంక్షేమ అభివృద్ధి పథకాలతోపాటు శాశ్వతమైన ఆస్తులను అందించారని ఎంపీడీవో కరుణాకర్రెడ్డి అన్నారు. కూసుమంచిలో గురువారం జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పంచాయతీ నుంచి ర్యాలీ నిర్వహించారు. పాలేరులో సర్పంచ్ ఎడవల్లి మంగమ్మ, నాయకన్గూడెంలో సర్పంచ్ కాసాని సైదులు, జీళ్లచెరువులో సర్పంచ్ కొండా సత్యం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. కూసుమంచిలో జరిగిన సభలో ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పల్లె నేడు అనేక రంగాల్లో దూసుకుపోతుందన్నారు. ఎంపీవో రామచందర్రావు, ఎంపీటీసీ మాదాసు ఉపేందర్రావు, సర్పంచ్ చెన్నా మోహన్, పంచాయతీ కార్యదర్శి శంకర్, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ, ఆశ వర్కర్లు, ఉపాధి హామీ కూలీలు, పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం, జూన్ 15: మండలంలోని 40 పంచాయతీల్లో గురువారం పల్లెప్రగతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో మహిళలు, ప్రజాప్రతినిధులు బతకమ్మలతో ర్యాలీ నిర్వహించారు. మండల కోఆప్షన్ సభ్యుడు ఎస్కే సైపుద్దీన్ కొక్కిరేణిలో పంచాయతీ వర్కర్లకు ఒక నెల వేతనాన్ని బహుమతిగా అందజేశారు. మల్టీపర్పస్ వర్కర్లను సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు.
నేలకొండపల్లి, జూన్ 15: మండలంలోని పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు జాతీయ జెండా ఎగుర వేశారు. అనంతరం గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. నేలకొండపల్లి, మండ్రాజుపల్లిలో సర్పంచ్లు జెండా ఎగుర వేశారు.
మధిరరూరల్, జూన్ 15: మాటూరుపేటలో సర్పంచ్ రావూరి శివనాగకుమారి, వెంకటాపురంలో సర్పంచ్ ధీరావత్ లక్ష్మి, నక్కలగరుబులో మునగా వెంకట్రావమ్మ, ఆత్కూరులో సర్పంచ్ అబ్బూరి సంధ్య జాతీయ జెండా ఎగురవేశారు.
బోనకల్లు, జూన్ 15: పల్లెప్రగతితోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని పలు గ్రామాల సర్పంచ్లు పేర్కొన్నారు. మండలంలోని 22 పంచాయతీ కార్యాలయాల వద్ద సర్పంచ్లు జాతీయ జెండా ఎగుర వేశారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు శాలువాలు కప్పి ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఖమ్మం రూరల్, జూన్ 15: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి దినోత్సవ వేడుకలు సంబురంగా జరిగాయి. ఒకరోజు ముందే ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్లు, సిబ్బంది సహాయంతో పంచాయతీ కార్యాలయాలను అందంగా ముస్తాబు చేశారు. ఉదయం 8గటంలకు పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. విలీన పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్లు తహసల్దార్ టీ సుమా, ఎంపీడీవో అశోక్కుమార్, పెద్దతండా పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు జెండా ఆవిష్కరించారు.
ముదిగొండ, జూన్ 15: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లెప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని 25 పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండా అవిష్కరించి సంబురాలు ప్రారంభించారు. గ్రామాల్లో తెలంగాణ పండుగలైన బతుకమ్మ, బోనాలతో ర్యాలీలు నిర్వహించారు. గ్రామసభలు నిర్వహించి రాష్ట్ర ఆవిర్భావం తరువాత గ్రామాల్లో జరిగిన అభివృద్ది గురించి వివరించారు.