ఖమ్మం, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. హైదరాబాద్- విజయవాడ రహదారి, ఖమ్మం రోడ్డును కలుపుతూ ఫ్లైఓవర్ నిర్మాణం కానున్నది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తం చేస్తూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి శుక్రవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్-విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిని కలుపుతూ మూసీ నది బ్రిడ్జి దాటిన తర్వాత టేకుమట్ల సమీపంలో ఖమ్మానికి కొత్త రోడ్డు నిర్మాణం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు సూర్యాపేట వైపు రాయినిగూడ గ్రామ సమీపానికి సుమారు రెండు కిలోమీటర్లు వెళ్లి యూటర్న్ తీసుకోవలసి వస్తున్నది. ఇది వాహనదారులకు ఇబ్బంది, ప్రమాదకరంగా మారింది. పలు ప్రమాదాలు సైతం చోటుచేసుకున్నాయి.
ఈ బ్లాక్ స్పాట్ గురించి ఎంపీ వద్దిరాజు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని పలుమార్లు స్వయంగా కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. ఎంపీ విజ్ఞప్తులను పరిశీలించిన కేంద్రమంత్రి ఫ్లైఓవర్ను మంజూరు చేశారు. దీని నిర్మాణ పనులను నేషనల్ హైవేస్ అథారిటీ(ఎన్హెచ్ఏ) త్వరలో చేపట్టనుంది.