నేలకొండపల్లి, జూన్ 7 : రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని, గడిచిన తొమ్మిదేళ్లల్లో 71 ప్రాజెక్ట్లను నిర్మించినట్లు ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నేలకొండపల్లిలోని వ్యవసాయ మార్కెట్యార్డులో బుధవారం సాగునీటి దినోత్సవ సంబురాలను నిర్వహించారు. ఎంపీ నామాతోపాటు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ ఒకప్పుడు రాష్ట్రంలో చెరువులు, కుంటలు ఎండిపోయేవని ‘మిషన్ కాకతీయ’తో ఈ రోజు ఎక్కడచూసినా నీటితో కళకళలాడుతున్నాయన్నారు. రాష్ట్రంలో 1,200 చెక్డ్యాములను నిర్మించినట్లు తెలిపారు. గ్రామాలు, ప్రజలు బాగుండాలని సాగునీటి ప్రాజెక్ట్లను అభివృద్ధి చేసారన్నారు. రైతులు రెండు పంటలను పండించుకునేలా ప్రస్తుతం సాగునీటి వనరులు ఉన్నాయన్నారు. పాలేరులో ఒకప్పుడు రైతులు నీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుతం పాలేరు సస్యశ్యామలంగా మారిందన్నారు. గోదావరి జలాలను జిల్లాకు తీసుకొచ్చేందుకు సీతారామ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందన్నారు.
వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు : ఎమ్మెల్సీ తాతా మధు
తెలంగాణ వచ్చిన తరువాత వ్యవసాయరంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎంచెప్పారో దాన్ని చేసి చూపించారన్నారు. తెలంగాణ వస్తే రైతుబంధు, రైతుబీమా వస్తుందని ఎవరూ ఊహించలేదన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సాగునీరు, కరెంటు, పెట్టుబడి, విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందిస్తున్నదన్నారు.
దార్శనికుడు సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి
రాష్ట్రం 2014కు ముందు ఎలా ఉండేదో రైతులకు తెలుసని, 2014 తరువాత కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో సీతారామ ద్వారా పాలేరుకు గోదావరి జలాలు కూడా రానున్నాయన్నారు. అన్నివర్గాల సంక్షేమ కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ నంబూరి శాంత, ఎంపీపీలు వజ్జా రమ్య, బోడ మంగీలాల్, డీసీసీబీ డైరెక్టర్లు ఇంటూరి శేఖర్, చావా వేణుగోపాల్, జడ్పీటీసీ యండవల్లి వరప్రసాద్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శాకమూరి సతీశ్, ఎంపీటీసీ శీలం వెంకటలక్ష్మి, ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వరరావు, డీఈఈ మన్మధరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, సొసైటీ చైర్మన్ కోటి సైదారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.