టేకులపల్లి, మే 14 :దేశంలో బీజేపీ పతనం కర్ణాటకతోనే ప్రారంభమైందని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లోనూ దేశ ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఆదివారం టేకులపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామా మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ అందిస్తున్న పథకాలను గమనిస్తున్న దేశ ప్రజలు.. కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమని, మూడోసారి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. ప్రతి ఇంట్లోనూ బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఉన్నారని, వారంతా బీఆర్ఎస్ వెంటే ఉంటారని స్పష్టం చేశారు.
దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయమే ఇందుకు నిదర్శనమని తేల్చిచెప్పారు. రానున్న రోజుల్లో దేశ ప్రజలు కూడా ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఇదే క్రమంలో తెలంగాణలో రైతులకు, ప్రజలకు సీఎం కేసీఆర్ అందిస్తున్న పథకాలను చేస్తున్న అభివృద్ధిని దేశ ప్రజలు గమనిస్తున్నారని, వారు కూడా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమని, మూడోసారి కూడా కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. టేకులపల్లి మండల కేంద్రంలో ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ అధ్యక్షతన ఆదివారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామా మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని, ఇదంతా సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యమైందని స్పష్టం చేశారు. ఇల్లెందు నియోజకవర్గం కూడా అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా ఉందని అన్నారు. సీఎం కేసీఆర్కు ఈ నియోజకవర్గంపై ఉన్న ప్రత్యేక అభిమానంతో అత్యధిక నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఇల్లెందు నియోజకవర్గంలోని రోళ్లపాడు వద్ద నిర్మించే సీతారామ ప్రాజెక్టు కోసం రూ.3,320 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన బస్ డిపో మంజూరు చేశారని వివరించారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరిత ధోరణిని అవలంబించినా అభివృద్ధిని అడ్డుకోలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు బలం, బలగం కార్యకర్తలు, ప్రజలేనని అన్నారు.
సైనికుల్లా పనిచేయాలి: ప్రభుత్వ విప్ రేగా
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. ఆత్మీయ సమ్మేళనం ద్వారా పార్టీ మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం శ్రేణులు సైనికుల్లాగా పని చేయాలని కోరారు. ఇల్లెందు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు.
ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు: ఎమ్మెల్యే హరిప్రియ
నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లోనూ బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఉన్నారని అన్నారు. వారంతా బీఆర్ఎస్ వెంటనే ఉంటారని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ ద్వారా లబ్ధి పొందిన కొందరు నాయకులు ఇప్పుడు స్వార్థ రాజకీయాలకు తెరలేపుతున్నారని అన్నారు. వారి చెప్పే మాయమాటల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
భారీ బైక్ ర్యాలీ..
తొలుత బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో బేతంపూడి స్టేజీ నుంచి టేకులపల్లి బోడు రోడ్డు సెంటర్ వరకు నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సమ్మేళనంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు దిండిగాల రాజేందర్, పులిగండ్ల మాధవరావు, బానోత్ హరిసింగ్నాయక్, లాల్సింగ్, బొమ్మెర్ల వరప్రసాద్గౌడ్, బోడ బాలునాయక్, బానోత్ రామానాయక్, కిషన్నాయక్, లక్కినేని శ్యామ్బాబు, కంభంపాటి చంద్రశేఖర్రావు, తాతా గణేశ్, శ్రీనివాసచౌదరి, భూక్యా రాధ, మాలోత్ రాజేందర్, బాలకృష్ణ, రమాదేవి, ప్రియాంక, ఇస్లావత్ బాలునాయక్, బర్మవత్ శివకృష్ణ, జాటోత్ నరేశ్, భూక్యా పాపానాయక్, జర్పుల లచ్చునాయక్, ఉండేటి బసవయ్య, శ్యామ్, లక్కినేని రంగ, బానోత్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.