ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధితో పాటు, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఖమ్మం లోక్సభ సభ్యుడు నామా నాగేశ్వరరావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని తనికెళ్ల నుంచి బోడియాతండా మీదుగా ఖమ్మం అర్బన్ మండలం గణేశ్వరం వరకు రూ.3.33 కోట్ల పీఎంజీఎస్ఐ నిధులతో నిర్మించనున్న బీటీరోడ్డు నిర్మాణానికి ఎంపీ నామా నాగేశ్వరరావు స్థానిక శాసనసభ్యుడు లావుడ్యా రాములునాయక్తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాపై కేంద్రం చిన్నచూపు చూపుతోందన్నారు. తన హయాంలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో కేవలం 65 కి.మీ. రోడ్డు పనులు మాత్రమే మంజూరు చేయగా తాను కొట్లాడి 115 కి.మీ. పెంచామన్నారు. గ్రామాలు బాగుండాలనేది సీఎం కేసీఆర్ అభిమతమని తెలిపారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రవేశపెట్టి రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నారన్నారు. సీతారామప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కాబోతుందన్నారు.
తనికెళ్ల గ్రామంలో సుమారు 100కు పైగా లారీలు ఉన్నాయని, దానిని 10 గ్రామాల వారు తనికెళ్ల నుంచి ఖమ్మం పట్టణానికి వెళ్తుంటాయని, తనికెళ్ల గ్రామంలో డివైడర్లు ఏర్పాటు చేసి డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ మోహన్రావు విజ్ఞప్తి చేశారు. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అధ్యక్షతన జరిగిన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీపీ గోసు మధు, జడ్పీటీసీ పోట్ల కవిత, సర్పంచ్లు చల్లా మోహన్రావు, వీ.బాలాజీ, పంచాయతీరాజ్ ఈఈ చంద్రమౌళి, ఏఈఈ రమేష్, మండల నాయకులు, వివిధ గ్రామపంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.