సత్తుపల్లి: దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని..దేశం చూపంతా తెలంగాణ వైపే ఉందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తూ తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ఆత్మీయుడయ్యారని ఆయన కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే ఉన్నారని, ఇప్పటికే పల్లె నుంచి జిల్లా స్థాయివరకు గ్రామ, పట్టణ, మండల కమిటీలు పూర్తయ్యాయని, ఈనెల 25న జరిగే టీఆర్ఎస్ ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతులనెత్తిన భారం మోపుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తెలంగాణ రైతులకు వరాలు కురిపిస్తున్నారని, ఢిల్లీ వెళ్లి ఉద్యమం చేస్తున్న రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీటిని అందిస్తూ రాష్ట్రంలో రహదారులను అద్దంలా తీర్చిదిద్దుతూ అభివృద్ధిలో ముందున్నారని, విద్యపై ప్రత్యేక దృష్టి సారించి గురుకులాలు, మైనార్టీ స్కూళ్లను ఏర్పాటు చేసి కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తున్న ఘనత కూడా కేసీఆర్దేనన్నారు. ఉమ్మడి జిల్లా ప్రజల కలగా ఉన్న సీతారామప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ముమ్మరం చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని, త్వరలోనే ప్రాజెక్టు పూర్తిచేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎంపీ నామా నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు.