ఖమ్మం రూరల్, ఏప్రిల్ 16 : బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు, కేసులు కొత్తేమీ కాదని, ఈ విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని, వారికి అండగా మేమున్నామని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు భరోసా ఇచ్చారు. పండితాపురంలో ఇటీవల జరిగిన కేసులో జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న దనేకుల హనుమంతరావు, దనేకుల మాధవరావు, చల్లా హరి, చల్లా నాగేంద్రబాబు, చల్లా నరేశ్లను ములాఖత్ ద్వారా మంగళవారం వారు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాడు స్వరాష్ట్రం కోసం.. నేడు తెచ్చిన తెలంగాణను కాపాడుకోవడం కోసం ఉద్యమాలు చేయక తప్పదన్నారు. ఏ కార్యకర్తకు ఇబ్బంది కలిగినా చూస్తూ ఊరుకోమని, వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. పరామర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోత్ హరిప్రియానాయక్తోపాటు పలువురు నాయకులు ఉన్నారు.