ఖమ్మం వ్యవసాయం, మార్చి 9 : ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్కు వచ్చిన మిర్చి బస్తాల్లో సగానికి పైగా బస్తాలు కోల్డ్స్టోరేజీలకే తరలుతున్నాయి. ఏటా సీజన్ పూర్తయినా కోల్డ్స్టోరేజీల నిల్వసామర్థ్యంలో కనీసం సగం కూడా నిండేది కాదు. కానీ.. ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తున్నది. చైనాకు చెందిన ప్రముఖ కంపెనీలు మిర్చి కొనుగోళ్లను మందకొడిగా చేపడుతుండడం, ఆశించిన మేర ఎగుమతులు లేకపోవడంతో ఖరీదుదారులు తాము కొన్న మిర్చిలో సింహభాగాన్ని నేరుగా కోల్డ్స్టోరేజీలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం మార్కెట్ సమీపంలోని కోల్డ్స్టోరేజీలు మిర్చి బస్తాలతో పూర్తిస్థాయిలో నిండిపోయాయి. స్టోరేజీ యజమానులు మిర్చి బస్తాలు నిల్వ చేసేందుకు చోటు లేదని బోర్డులు సైతం పెట్టారు.
పెరిగిన సాగు విస్తీర్ణం.. కానీ.. మిర్చి ధర మాత్రం తక్కువే..
గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు వానకాలంలో మిర్చి సాగు చేశారు. ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో వచ్చే సీజన్లో మిర్చి సాగు విస్తీర్ణం మరింత పరిస్థితి గోచరిస్తున్నది. మరోవైపు రానున్న రోజుల్లో మిర్చి ధరలు మరింత పెరుగుతాయని ఖరీదుదారులు అంచనా వేస్తున్నారు. దీంతో కొన్న మిర్చిని కోల్డ్స్టోరేజీల్లో భద్రంగా దాచిపెడుతున్నారు. జిల్లాలోని కోల్డ్స్టోరేజీలు 75 శాతానికి పైగా మిర్చి బస్తాలతో నిండడమే అందుకు నిదర్శనం. గతేడాది రికార్డు స్థాయిలో మిర్చి ధరలు పలకడంతో కోల్డ్స్టోరేజీలన్నీ ఖాళీ అయ్యాయి. నాడు ఒక క్వింటాల్కు మిర్చి ధర రూ.25 వేలకు పైగా పలికింది. ఈ ఏడాది కూడా అదే ఒరవడి ఉంటుందని రైతులు, ఖరీదుదారులు భావించారు. కానీ.. ఈసారి గరిష్ఠ ధర క్వింటాల్కు రూ.21,100 మించి లేదు. నాణ్యమైన పంట రావడం లేదనే ఉద్దేశంతో వ్యాపారులు కేవలం ఒకటి రెండు లాట్లకు మాత్రమే జెండా పాట పెట్టి ధర నిర్ణయిస్తుండడంతో అది నచ్చని రైతులు తమ పంటను కోల్డ్ స్టోరేజీలకు తరలిస్తున్నారు.
కోల్డ్స్టోరేజీల్లో నిల్వలు ఇలా..
జిల్లాలో ఖమ్మం ఏఎంసీతో పాటు మధిర, నేలకొండపల్లి, మద్దులపల్లి, వైరా, కల్లూరు, సత్తుపల్లి, ఏన్కూరులో ఏఎంసీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కేవలం ఐదు మార్కెట్ల పరిధిలో మాత్రమే కోల్డ్స్టోరేజీలు ఉన్నాయి. సత్తుపల్లి, కల్లూరు, ఏన్కూరు మార్కెట్ల పరిధిలో కోల్డ్స్టోరేజీలు లేవు. ఖమ్మం ఏఎంసీ పరిధిలోని 14 కోల్డ్స్టోరేజీల నిల్వ సామర్థ్యం 11.28 లక్షల బస్తాలు కాగా ప్రస్తుతం 5.13 లక్షల బస్తాలతో నిండిపోయాయి. నేలకొండపల్లి ఏఎంసీ పరిధిలోని రెండు కోల్డ్స్టోరేజీల నిల్వసామర్థ్యం 2.20 లక్షల బస్తాలు కాగా.. ప్రస్తుతం వాటిలో 65 వేల బస్తాలు ఉన్నాయి. వైరా ఏఎంసీ పరిధిలోని ఆరు కోల్డ్ స్టోరేజీల నిల్వసామర్థ్యం 8.30 లక్షల బస్తాలు కాగా ప్రస్తుతం వాటిలో 2.30 లక్షల బస్తాలు ఉన్నాయి. మద్దులపల్లి ఏఎంసీ పరిధిలో ఆరు కోల్డ్స్టోరేజీల నిల్వసామర్థ్యం 9.75 లక్షల బస్తాలు కాగా.. వాటిలో ప్రస్తుతం 4.31లక్షల బస్తాలు నిల్వ ఉన్నాయి. మధిర ఏఎంసీ పరిధిలోని 12 కోల్డ్ స్టోరేజీల నిల్వసామర్థ్యం 12.40 లక్షల బస్తాలు కాగా.. ప్రస్తుతం వాటిలో 7.12 లక్షల బస్తాలు నిల్వ ఉన్నాయి. ఇలా ఐదు ఏఎంసీల పరిధిలోని 43 కోల్డ్స్టొరేజీల నిల్వసామర్థ్యం 43.93 లక్షల బస్తాలు కాగా.. ప్రస్తుతం వాటిలో 19.52 లక్షల బస్తాలు నిల్వ ఉన్నాయి. ఈ చొప్పున మరో 24.40 లక్షల బస్తాలను మాత్రమే కోల్డ్స్టోరేజీల్లో నిల్వచేసేందుకు అవకాశం ఉంది.
ఒక్కో కోల్డ్స్టోరేజీలో ఒక్కో ధర..
కోల్డ్స్టోరేజీ యాజమాన్యాలు రైతులు, వ్యాపారుల నుంచి ఇష్టారీతిన కిరాయిలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. నగరంలోని కోల్డ్స్టోరేజీల యాజమాన్యాలు నెలకు ఒక బస్తాకు రూ.210 నుంచి రూ.220 వసూలు చేస్తుండగా, నగర శివారులోని కోల్డ్స్టోరేజీ యాజమాన్యాలు రూ.150- రూ.160 వరకు వసూలు చేస్తున్నాయి. ఖమ్మం ఏఎంసీలో మిర్చి ఖరీదు చేసే వ్యాపారుల్లో మెజార్జీ మందికి సొంత కోల్డ్స్టోరేజీలు ఉన్నాయి. వీరు మిగిలిన వ్యాపారులు, రైతుల నుంచి అధిక మొత్తంలో కిరాయిలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఇందులోనూ రైతులకు ఒక ధర, వ్యాపారులకు ఒక ధర ఉన్నట్లు సమాచారం. యాంత్రాంగం పట్టించుకోకపోవడంతోనే కోల్డ్స్టోరేజీల యాజమాన్యాలు నియంత్రణ పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం నగర పరిధిలోని కోల్డ్స్టోరేజీలన్నీ దాదాపు నిండేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో రైతులు పంటను దాచుకునేందుకు నగర శివారులోని కోల్డ్స్టోరేజీలకు వెళ్తున్నారు.
పంట నిల్వల వివరాలు..