ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 1: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సరికొత్త సొబగులు సంతరించుకోబోతున్నది. యావత్ తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన ఖమ్మం మార్కెట్కు మరింత శోభ రానున్నది. కొద్దినెలల క్రితమే మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్వీయ ఆలోచన ఫలితంగా ఆధునిక మోడల్ మార్కెట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. తద్వార జిల్లా రైతాంగంతోపాటు, పొరుగుజిల్లాల రైతులకు మరిన్ని సౌలతులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే మార్కెట్ పరిధిలోని మిర్చి, అపరాలు, పత్తి పంటకు వేర్వేరుగా యార్డులు అందుబాటులో ఉన్నాయి. అయితే గత కొద్ది సంవత్సరాలుగా పంట దిగుబడులు పెరగడంతో యార్డుల విస్తీర్ణం మరింత పెంచేందుకుగాను మార్కెట్ పాలకవర్గం పలు నిర్ణయాలను తీసుకున్నది. అందులో భాగంగా ఇప్పటికే మార్చి యార్డులో పురాతన భవనాలను పూర్తిగా తొలగించారు. వాటి స్థానంలో నూతన భారీ షెడ్లు, యార్డులకు సంబంధించిన ముఖద్వారాలు, మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఆధునీకణతో కూడిన సీసీ రోడ్లు, సైడు కాల్వల నిర్మాణాలు, రైతు విశ్రాంతి భవనం, మార్కెట్ కమిటీ కార్యాలయం భవనం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే మంత్రులు, పువ్వాడ అజయ్కుమార్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సదరు నిర్మాణ పనులకు శంకుస్థానప చేసిన సంగతి తెలిసిందే. 2 నెలల నుంచి నిర్మాణ పను లు శరవేగంగా కొనసాగుతున్నాయి.
కొద్దిరోజుల్లో మార్కెట్కు వానకాలం మిర్చి పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నగర మార్కెట్కు పత్తిపంట రావడం ప్రారంభమైంది. అయితే నిర్మాణ పనులు మిర్చియార్డులో జరుగుతున్నందున రైతులు, వ్యాపారులు, కార్మికులకు ఎలాంటి ఇబ్బంది రాకుడదనే ఉద్దేశంతో అధికారులు పనులను ముమ్మరం చేశారు. మార్కెట్ ముఖద్వారం నుంచి అగ్నిమాపక కేంద్రం వరకు రెండు లైన్ల సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. దీంతో నిత్యం మార్కెట్కు పంటను తీసుకొచ్చే వాహనాలకు ఇబ్బందులు తొలగాయి. మిగిలిన మిర్చియార్డులో ఏర్పాటు కాబోతున్న రెండు బారీ షెడ్లు నిర్మాణాలు తుది దశకు చేరాయి. ఒకవైపు మార్కెట్ పరిసర ప్రాంతాల్లో డబుల్ లైన్ల రహదారులు, యార్డుల్లో నూతన షెడ్లు ఏర్పాటు చేస్తుండటంతో పంటను మార్కెట్కు తీసుకొస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు వచ్చినప్పటికీ పంటకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణపనులు శరవేగంగా జరిగేవిధంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, సెక్రటరీ ఆర్.మల్లేశం నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు దాదాపుగా 80 ఏండ్ల చరిత్ర ఉంది. ఈ దశాబ్దాల కాలంలో మార్కెట్ అభివృద్ధికి నాటి ప్రభుత్వాలు ఎలాంటి ఆలోచన చేయలేదు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్వయంగా అనేకసార్లు మార్కెట్ను సందర్శించి మార్కెట్ ఆధునీకరణ గూర్చి వర్తకసంఘం వ్యాపారులు, కార్మిక సంఘాల నేతలతో చర్చించారు. ఫలితంగా ఒక్కటికాదు రెండు రూ.10 కోట్ల నిధులను మంజూరు చేయించడంతోపాటు నిర్మాణ పనులను ప్రారంభించారు. దీంతో యార్డు విస్తీర్ణం మరింత పెరగనున్నది. కొత్తగా మరో 150మందికి కమీషన్ లైసెన్స్లను సైతం అందించడం జరిగింది. మార్కెట్ అభివృద్ధికి, వ్యాపారుల ఇబ్బందులను తొలగించిన మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు పాలకవర్గం, కార్మికులు, రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
-దోరేపల్లి శ్వేత, ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్