స్ట్రాబెర్రీ, గోల్డెన్ బెర్రీ కేవలం శీతల ప్రాంతాల్లో పండే పంటలు. మన ప్రాంత వాతావరణంలో కూడా పండించవచ్చని నిరూపించారు మందలపల్లి నాగరాజు, చంటి. కూసుమంచి మండలం కేశ్వాపురం గ్రామానికి చెందిన ఈ యువ రైతులిద్దరు కలిసి ఈ ఏడాది ప్రయోగాత్మకంగా స్ట్రాబెర్రీ, గోల్డెన్ బెర్రీ పండించి ఔరా అనిపించారు. రసాయన మందులు వాడకుండానే ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పంటను స్థానికంగా అమ్మకాలు చేస్తూనే, ఎగుమతి సైతం చేస్తున్నారు. మన భూమి, మన వాతావరణంలో పండుతుందో.. లేదోననే అనుమానాల మధ్య పంటవేసిన 45 రోజుల్లో దిగుబడి బాగా రావడంతో ఆ యువ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో రుచికరంగా ఉండే ఈ పండ్లు శీతల ప్రాంతాల్లోనే కాదు.. తగిన జాగ్రత్తలతో మన దగ్గర కూడా పండించవచ్చని చెబుతున్న వారి అనుభవాలను ‘నమస్తే’తో పంచుకున్నారు.
కూసుమంచి మండలం కేశ్వాపురం గ్రామానికి చెందిన ఇద్దరు యువ రైతులు వినూత్నంగా ఆలోచించారు. ఆనవాయితీగా పండించే పంటలు కాకుండా మన ప్రాంతంలో గతంలో ఎవ్వరూ పండించని పంటలు పండించారు. కశ్మీర్తోపాటు శీతల ప్రాంతాల్లో మాత్రమే పండే స్ట్రాబెర్రీ, గోల్డెన్ బెర్రీ వేయాలని ఆలోచన వచ్చిందే తడవుగా ఆంధ్రాలోని లంబసింగి వెళ్లి సుమారు రూ.లక్ష ఖర్చుతో ఏసీ కంటైనర్లో మొక్కలను తీసుకొచ్చారు. వాటిని వారం రోజులపాటు మన వాతావరణంలో జాగ్రత్తగా భద్రపరిచి ప్రయోగాత్మకంగా కొద్ది విస్తీర్ణంలో సాగు చేసి సక్సెస్ అయ్యారు. పోగర్లు ఏర్పాటు చేసి వేడిని సగానికి సగం తగ్గించడంతో నెల పదిహేను రోజుల్లోనే స్ట్రాబెర్రీ చేతికొచ్చింది. వాటిని బాక్స్ల్లో పెట్టి ఖమ్మం, కూసుమంచి పండ్ల వ్యాపారులకు అమ్ముతూ, లంబసింగికి కూడా ఏసీ కంటైనర్లో ఎగుమతి చేశారు. 8 కుంటల్లో అక్టోబర్ 4వ తేదీన వేసిన మొక్కలు 45 రోజుల నుంచే దిగుబడి రావడంతో ప్రతిరోజు 20 బాక్స్లకుపైగా అమ్మకాలు చేస్తూ డైలీ సుమారు రూ.2 వేల ఆదాయాన్ని పొందుతున్నారు.
అధిక దిగుబడులు, డబ్బులు బాగా రావాలని విచ్చలవిడిగా రసాయన మందులు వాడుతున్న ఈ రోజుల్లో పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో స్ట్రాబెర్రీ పండిస్తూ ఆదర్శంగా నిలిచారు నాగరాజు, చంటి. కూసుమంచి-ఖమ్మం రోడ్డులో చేగొమ్మ క్రాస్రోడ్డు వద్ద వ్యవసాయ భూమిలో మిర్చి నర్సరీ కోసం నెట్, మల్చింగ్ చేసి డ్రిప్ సాయంతో మిర్చినారు పెంచారు. సీజన్ అయిపోగానే నెట్ ఖాళీగా ఉండకుండా ఒక ప్రయత్నంగా స్ట్రాబెర్రీ, గోల్డెన్ బెర్రీ పండిస్తున్నారు. ఎప్పుడూ నీటితడి ఆరకుండా నెట్ను రోజుకు రెండు దఫాలు తడుపుతూ వేడి వాతావరణాన్ని తగ్గించారు. రసాయన మందులు పూర్తిగా నిషేధించి సేంద్రియ ఎరువులు డ్రిప్ ద్వారా అందించి మంచి దిగుబడి సాధించారు. రుచికరమైన కేశ్వాపురం స్ట్రాబెర్రీ పండ్లను బాక్స్ రూ.100 నుంచి రూ.125 మధ్య మార్కెట్లో అమ్ముతున్నారు. రైతువారీగా రూ.80 నుంచి రూ.90 వరకు స్థానిక వ్యాపారులకు అమ్ముతున్నారు. రోజుకు రూ.1,800 నుంచి రూ.2,200 వరకు ఆదాయం వస్తున్నట్లు యువ రైతులు తెలిపారు.
మందపల్లి నాగరాజు ఇటీవల కొందరు రైతులతో కలిసి లంబసింగి ఊరు వెళ్లాడు. అక్కడ పండుతున్న స్ట్రాబెర్రీ, గోల్డెన్ బెర్రీ పంట వివరాలు తెలుసుకున్నాడు. స్నేహితుడు చంటితో కలిసి మన వద్ద కూడా పండించాలని ఆలోచనకు వచ్చారు. నాగరాజు తన తండ్రి చలపతిరావుతో మాట్లాడి 5 కుంటల్లో గోల్డెన్ బెర్రీ, 3 కుంటల్లో స్ట్రాబెర్రీ వేశారు. ప్రస్తుతం స్ట్రాబెర్రీ దిగుబడి రావడంతో మూడు నెలల నుంచి అమ్మకాలు చేస్తున్నారు. జామ్ కూడా తయారు చేసి చిన్నచిన్న డబ్బాల్లో ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు.
శీతల ప్రాంతాల్లోనే కాదు మన దగ్గర కూడా స్ట్రాబెర్రీ, గోల్డెన్ బెర్రీ పండుతుంది. కానీ.. జాగ్రత్తలు తీసుకోవాలి. 8 కుంటల్లో పంటలు వేశాం. వచ్చేసారి ఎకరంలో వేస్తాం. కొంత అనుభవం వచ్చింది. మార్కెటింగ్ కూడా అర్థమైంది. భవిష్యత్లో కూడా పూర్తి ఆర్గానిక్ పద్ధతిలోనే సాగు చేస్తాం. మన దగ్గరికి ఇతర ప్రాంతాల నుంచి పండ్లు రావడం కంటే మన ప్రాంతంలో పండడం ఆనందంగా ఉంది. కూసుమంచి, ఖమ్మం మార్కెట్లో మా పంట అమ్ముతుంటే కలిగే సంతోషం చెప్పలేనిది.
మొక్కలు నాటినప్పటి నుంచి 45 రోజుల తర్వాత ప్రతిరోజూ ఆదాయం వస్తున్నది. స్ట్రాబెర్రీ, గోల్డెన్ బెర్రీ రెండూ పండిస్తున్నాం. స్ట్రాబెర్రీ గత నవంబర్ నుంచి రోజూ కోసి అమ్మకాలు చేస్తున్నాం. మళ్లీ ఫ్లవరింగ్ వచ్చింది. గోల్డెన్ బెర్రీ కాయలు అవుతున్నాయి.. ఇంకా పక్వానికి రాలేదు. పండు బహురుచిగా ఉండడంతో పిల్లులు, ఎలుకలు వంటివి బాగా వస్తున్నాయి. కోతులు, పక్షుల నుంచి కాపాడుకోకపోతే పంట పండించలేం. మన వాతావరణాన్ని సగానికి సగం వేడి తగ్గించినప్పుడే పంట దిగుబడి వస్తుంది.