దుమ్ముగూడెం, అక్టోబర్ 12: వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని ఎమ్మెల్సీ, పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి తాతా మధు అన్నారు. నడికుడి గ్రామంలో గురువారం భద్రాచలం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావుతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమవేశంలో ఆయన మాట్లాడారు. వెంకట్రావు ఎన్నో ఏళ్ల నుంచి పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారని, అలాంటి వ్యక్తిని ప్రజలు ఎన్నికల్లో గెలిపించుకుంటే ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. వెంకట్రావును గెలిపిస్తే దుమ్ముగూడెం మండలవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయిస్తామన్నారు.
60 ఏళ్ల నుంచి పాలనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. భద్రాద్రి జిల్లాకు పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్లో ఎలాంటి పథకాలు అమలుతున్నాయో.. మన వద్ద ఎలాంటి పథకాలు అమలవుతున్నాయో ప్రజలు తెలుసుకోవాలన్నారు. పంటలకు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు.
ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చేందుకు మోసపూరిత ప్రకటనలు చేస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు వారంటీ లేనివన్నారు. 1,200 మంది బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చిందన్నారు. భద్రాచలం నియోజకవర్గం 50 సంవత్సరాల నుంచి వెనుకబడి ఉందని, బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటే సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందన్నారు.
పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ… 2018లో బీఆర్ఎస్ అధిష్ఠానం తనకు టికెట్ ఇచ్చిందన్నారు. ఆ ఎన్నికల్లో ఓటమిచెందానని, ఈసారి మళ్లీ తిరిగి తనకే పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టికెట్ ఇవ్వడం ఆనందాన్నిచ్చిందన్నారు. భద్రాచలం ఏజెన్సీలో పుట్టిన తనను ఎన్నికల్లో గెలిపించాలని, తద్వారా నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు అన్నెం సత్యనారాయణమూర్తి, కార్యదర్శి కల్తి రాములు, సర్పంచ్ మట్టా వెంకటేశ్వరరావు, పార్టీ అధికార ప్రతినిధి ఎండీ జానీపాషా, శ్రీనివాసరాజు (వాసు), జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, నాయకులు తాండ్ర రమణ, రమేశ్ గౌడ్, బొలిశెట్టి రంగారావు, హనుమంతరావు, ఎండీ నవాబ్ పాల్గొన్నారు.
నడికుడి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 55 కుటుంబాలు గురువారం బీఆర్ఎస్ భద్రాచలం ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ తాతా మధు సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. వారికి మధు గులాబీ కండువాలు కప్పి దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు. ప్రతిపక్ష పార్టీలను నమ్మొద్దని, వచ్చే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
భద్రాచలం, అక్టోబర్ 12: భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ, పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి తాత మధుసూదన్ అన్నారు. గురువారం ఆయన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావుతో కలిసి విశ్రాంత బ్యాంక్ అధికారి కోటగిరి ప్రబోధ్కుమార్తోపాటు పలువురు ప్రముఖులను కలిశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని కోరారు. వారి వెంట పార్టీ నాయకులు తాండ్ర వెంకట రమణారావు, దుద్దుకూరి సాయిబాబా, బొలిశెట్టి రంగారావు, తాండ్ర నరసింహారావు పాల్గొన్నారు.