కారేపల్లి, మార్చి 24 : నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేదలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మండిపడ్డారు. మండల పరిధిలోని పేరుపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మండల నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం పది గ్రామ పంచాయతీలతో పెద్దఎత్తున ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ కేంద్రం పేదల పట్ల వివక్ష చూపిస్తుంటే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్నివర్గాలకు అండగా నిలుస్తున్నారన్నారు. పోరాడి సాధించిన వెనుబడిన తెలంగాణను ఎనిమిదేళ్ల కాలంలోనే దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దన్నారు.
2014 కంటే ముందున్న తెలంగాణ వేరు ప్రస్తుతం ఉన్న తెలంగాణ వేరన్నారు. బీజేపీపాలిత రాష్ర్టాల్లో సీఎం కేసీఆర్ లాంటి నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ సుపరిపాలను చూసి బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. అడుగడుగునా అభివృద్ధికి అడ్డుపడటమే వారు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సీఎం కేసీఆర్ వెనుకడుగు వేసేదే లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్ నడిబొడ్డన 125అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి వచ్చే నెల 16న ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారన్నారు. దమ్ముంటే పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టే సత్తా ప్రధాని మోడీకి ఉందా అని సవాలు విసిరారు. వచ్చే నెల 25న వైరాలో నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నామని ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటి ముందు గులాబీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గ్రామశాఖలు కృషి చేయాలన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్మోడల్ : ఎమ్మెల్యే రాములునాయక్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్మోడల్గా మారిందని ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలను అందజేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో దేశంలో బీఆర్ఎస్ గుణాత్మక మార్పును తీసుకురాబోతుందన్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్ పంపిన సందేశాన్ని సభలో చదివి వినిపించారు. అనంతరం పలు బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మాలోత్ శకుంతల, పార్టీ మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్, నాయకులు ముత్యాల సత్యనారాయణ, రావూరి శ్రీనివాసరావు, ముత్యాల వెంకట అప్పారావు, దుగ్గినేని శ్రీనివాసరావు, మంగీలాల్, మాలోత్ కిశోర్, అజ్మీరా వీరన్న, పప్పుల నిర్మల, బానోత్ పద్మావతి, నర్సింగ్ శ్రీనివాసరావు, బత్తుల శ్రీనివాసరావు, అడపా పుల్లారావు, అడ్డగోడ ఐలయ్య, భాగం నాగేశ్వరరావు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సామాన్యుల్లా హోటల్లో భోజనం
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ సామాన్యుల్లాగా రోడ్డు పక్కన ఓ చిన్న హోటల్లో భోజనం చేశారు. ఆత్మీయ సమ్మేళనం కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో వారు కారేపల్లి క్రాస్రోడ్లోని ముత్తమ్మ హోటల్కు హంగూ ఆర్భాటాలు లేకుండా వెళ్లి సాధారణ ప్రజలతో కలిసి ముచ్చటిస్తూ మధ్యాహ్న భోజనం చేశారు. అక్కడున్నవారు ఆశ్చర్యంతో వారిని చూస్తూ ఉండిపోయారు.