చర్ల, డిసెంబర్ 1: ఆరు గ్యారెంటీలను విస్మరించి ప్రజలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాధి కడదామని ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను రేవంత్ సర్కారు తుంగలో తొక్కిందని విమర్శించారు. బీఆర్ఎస్ మండలం కన్వీనర్ దొడ్డి తాతారావు అధ్యక్షతన చర్లలో ఆదివారం నిర్వహించిన పార్టీ మండలస్థాయి విస్తృతస్థాయి సమావేశంలో తాతా మధు మాట్లాడారు. స్వార్థంతో పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో చేరిన వారికి పరాభవం తప్పదని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు ఎంతో అభిమానంతో అహర్నిశలూ శ్రమించి ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు.
కానీ ఆ ఎమ్మెల్యే ఈ ప్రజలందరినీ మోసం చేసి కాంగ్రెస్లో చేరాడని దుయ్యబట్టారు. భద్రాచలం నియోజకవర్గానికి కచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందని, అప్పుడు కూడా బీఆర్ఎస్ గెలుపు ఖాయమవుతుందని స్పష్టం చేశారు. ప్రజలు కూడా బీఆర్ఎస్ని గెలిపించి.. పార్టీ మారిన వారికి, చేర్చుకున్న వారికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, సంక్షేమాన్ని పక్కకు పెట్టి రాష్ర్టాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ధ్వజమెత్తారు.
ఇదే సమయంలో ప్రజలందరూ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీతో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం పార్టీ శ్రేణులు శ్రమించాలని పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేని కాంగ్రెస్ పాలకులను నిలదీసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పోలీసులు లేకుండా వారు ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడిందని, ప్రజా తిరుగుబాటు అంటే ఏంటో వారికి ఇప్పుడు అర్థమవుతోందని దుయ్యబట్టారు. సమావేశంలో పార్టీ నేతలు మానే రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.