భద్రాచలం, మే 20: పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమష్టిగా, సమన్వయంతో పనిచేస్తే రాబోయే రోజులన్నీ బీఆర్ఎస్వేనని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్సీ, ఉమ్మడి జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు స్పష్టం చేశారు. భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల పార్టీ సమన్వయ కమిటీ సమావేశం భద్రాచలం పట్టణంలో బుధవారం నిర్వహించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి హాజరైన రవీందర్రావు మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు.
తీర్చలేని హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంమీద గెలిచి ఆ తర్వాత పార్టీ మారాడని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటుతో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. డిజిటల్ సభ్యత్వం పూర్తయిన తర్వాత బూత్, గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేస్తామని, ఆయా కమిటీలకు అనుగుణంగా ప్రతీ కార్యకర్త ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లి.. రాబోయే స్థానిక, సాధారణ ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ పదేళ్ల పాలనలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు.
జిల్లాలో మెడికల్ కాలేజీతోపాటు సీతారామ, సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లామని, గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేశామని, రైతుబంధు, రైతులకు ఉచిత విద్యుత్ అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలందరూ కేసీఆర్ రావాలి.. రేవంత్ పోవాలి.. అనే దృఢ సంకల్పంతో ఉన్నారని, అందుకోసం కష్టపడి పనిచేసి కేసీఆర్ను మళ్లీ సీఎం చేద్దామన్నారు. పార్టీ సభ్యత్వ నమోదును గడపగడపకూ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఐదు గ్రామపంచాయతీలు తిరిగి తెలంగాణకు ఇవ్వాలని అడిగినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనే పరిస్థితి లేక కొందరు రైతులు ఆవేదనతో కొనుగోలు కేంద్రాల్లోనే చనిపోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రవీడటం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలు, రైతులు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని, అందుకోసం ఇప్పటినుంచే కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణ, గొడపర్తి నర్సింహమూర్తి, అశ్వారావుపేట, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.