ఖమ్మం, ఏప్రిల్ 19 (సమస్తే తెలంగాణ ప్రతినిధి) /కల్లూరు: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్వార్థపూరిత వ్యక్తి అని, డబ్బు ఉందన్న అహంతో ధన రాజకీయాలు చేస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరులో బుధవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అధ్యక్షతన పార్టీ నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాజకీయాలకు కావాల్సింది ప్రజలకు సేవ చేయాలనే భావన అని, ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే వారే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాసంక్షేమం కోరే నేతగా రాష్ర్టాన్ని పాలిస్తున్నారన్నారు. ఆయనకు ప్రజల మద్దతు ఉందన్నారు. కేసీఆర్ను విమర్శించే స్థాయి పొంగులేటికి లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వనని అంటున్న పొంగులేటి, అసెంబ్లీ వద్ద గేట్ కీపర్గా ఏమైనా పనిచేస్తున్నారా.. అని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచి సరాసరి అసెంబ్లీలోకి వెళ్తామన్నారు.
రాష్ట్రం అధోగతి పాలైనందని అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో రైతుబంధు పేరిట రైతుల ఖాతాల్లో రూ.65 వేల కోట్లు జమ చేశారన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.20 వేల కోట్ల సాయం బాధితులకు అందించారన్నారు. అక్రమంగా డబ్బు సంపాదించి, పొంగులేటి ఇప్పుడు ధన రాజకీయాలకు తెరలేపారన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాల ప్రజాప్రతినిధులు, ప్రజలూ చూసి తమ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలను అమలు కావాలని కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ విజన్తోనే గ్రామాభివృద్ధి సాధ్యమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 46 అవార్డుల్లో రాష్ర్టానికి చెందిన 13 పంచాయతీలు పురస్కారాలు దక్కించుకోవడమే అందుకు నిదర్శనమన్నారు. పొరుగు రాష్ట్రమైన ఏపీకి ఒక్క అవాైర్డెనా దక్కలేదన్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. దేశంలో మరే ఇతర ముఖ్యమంత్రీ ఆ పనిచేయలేకపోయారన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు మాట్లాడుతూ.. మాజీ ఎంపీ పొంగులేటి డబ్బు ఉందన్న అహంతో కేసీఆర్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ను విమర్శించే స్థాయి పొంగులేటికి లేదన్నారు. ఇకనైనా పొంగులేటి బుద్ధి తెచ్చుకోవాలని, లేదంటే మున్ముందు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు అనంతరం పార్టీ అధినేత కేసీఆర్ సందేశాన్ని చదివి వినిపించారు. సమ్మేళనంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, జడ్పీటీసీ కట్టా అజయ్బాబు, ఎంపీపీ బీరవల్లి రఘు, రైతుబంధు సమితి సభ్యులు చందర్రావు, లక్కినేని రఘు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, సొసైటీ చైర్మన్లు చావా వెంకటేశ్వరరావు, నర్వనేని అంజయ్య, ముఖ్యనేతలు పెడకంటి రామకృష్ణ, కొరకొప్పు ప్రసాద్, ఇస్మాయిల్, కమ్లీ, పుసులూరి శ్రీనివాసరావు, సింగిశాల ప్రసాద్, రావి సూర్యనారాయణ, గంగవరపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
10కి పది స్థానాలు సాధిస్తాం..
రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదికి పది ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుని సరాసరి అసెంబ్లీకి వెళ్తాం. బీఆర్ఎస్ విజయాన్ని మాజీ ఎంపీ పొంగులేటి లాంటి వాళ్లు ఆపలేరు. ఆయనకు అంత సామర్థ్యం లేదు. తన వర్గం నుంచి ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్న వారిని చివరి వరకు తనతోనే ప్రయాణం కొనసాగించేలా చూసుకుంటారా..? లేదా పొంగులేటి చెప్పాలి. కేంద్రంలోని బీజేపీ నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నది. బీజేపీని గద్దె దించే సత్తా ఒక్క కేసీఆర్కు మాత్రమే ఉంది. ప్రజాసమస్యల పరిష్కారం కోసం పనిచేసే కేసీఆర్ ఒక్కరే.
– రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
పార్టీ ఆదేశాలే శిరోధార్యం..
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ప్రజలు ఏం మేలు చేశారో చెప్పాలి. ఏ నియోజకవర్గంలో ఏ పని తలపెట్టారో, వాటిలో ఎన్ని పూర్తయ్యాయో ప్రజలకు వివరించాలి. సొంత ఎజెండాతో బీఆర్ఎస్కు వెన్నుపోటు పొడించింది చాలక తిరిగి సీఎం కేసీఆర్నే విమర్శించడం పొంగులేటికే చెల్లింది. వ్యక్తిగత ఎదుగుదల కోసం ఎదురు చూసేవారికి బీఆర్ఎస్లో స్థానం ఉండదు. పార్టీలో పార్టీ అధినేత, అధిష్ఠానం చెప్పిందే శిరోధార్యం. పొంగులేటి వంటి స్వార్థ రాజకీయాలు చేసేవారికి మున్ముందు ప్రజలు బుద్ధి చెప్తారు.
– బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు
ప్రజలే ఆస్తి…కార్యకర్తలే బలగం..
ప్రజలే నా ఆస్తి. కార్యకర్తలే బలం..బలగం. సీఎం కేసీఆర్ ఆశయాల మేరకు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నాను. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన అభివృద్ధికి కొనసాగింపుగా ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నాను. బాధిత కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తున్నాను. 24 గంటల ప్రజాసంక్షేమం కోసమే పని చేస్తున్నాను. రూ.వేల కోట్ల ఆస్తులున్న పొంగులేటి ఏ మండలంలోనైనా, ఒక గ్రామం కోసమైనా నిధులు వెచ్చించలేదు. పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు బండి పార్థ్ధసారథిరెడ్డి రూ.కోటితో కల్లూరు బస్టాండ్ను నిర్మిస్తున్నారు. పొంగులేటి ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలి.
– సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్యే, సత్తుపల్లి
బీఆర్ఎస్సే ప్రజలకు అండ..
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా సాగుతున్నాయి. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనిస్తున్నారు. ఏపీలోని నెలకొన్న పరిస్థితులు అందరికీ తెలిసిందే. అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. పార్టీ అధినేత ఆశయాలకు ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందే. వచ్చే ఎన్నికల్లో సత్తుపల్లిలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి.
– జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు