భద్రాద్రి కొత్తగూడెం, మే 31 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హెచ్చరించారు. కొత్తగూడెంలోని తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్నమొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్న కోరం.. ఇప్పుడు సీఎం కేసీఆర్, మంత్రి అజయ్కుమార్ను విమర్శించడం హేయమన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి వెనుక నడుస్తూ అనుచిత వ్యాఖ్యలకు పాల్పడుతున్నారన్నారు. అనవసరంగా అవాకులు చెవాకులు పేలితే సహించబోమన్నారు. జడ్పీ చైర్మన్గా కోరం కనకయ్య రాజీనామా చేయాలన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జేవీఎస్ చౌదరి, మున్సిపల్ చైర్మన్ సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్, ఎంపీపీ శాంతి పాల్గొన్నారు.
పొంగులేటి దిష్టిబొమ్మ దహనం
డబ్బుతో ఏదైనా సాధించవచ్చని, అక్రమంగా సంపాదించిన డబ్బు వెదజల్లి ఎన్నికల్లో గెలవచ్చని విర్రవీగుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉమ్మడి జిల్లా ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రావి రాంబాబు, బీమా శ్రీధర్, బండి రాజుగౌడ్ అన్నారు. బుధవారం టీబీజీకేఎస్ కార్యాలయం నుంచి జడ్పీ కార్యాలయం వరకు బీఆర్ఎస్ నాయకులు ప్రదర్శన చేశారు. అనంతరం అక్కడ పొంగులేటి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ పొంగులేటి, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యలు తమ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని అన్నారు.