భద్రాచలం, డిసెంబర్ 19 : కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించామని, ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేశామని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గుర్తు చేశారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఇటీవల ఆస్పత్రిలో కంటి శస్త్ర చికిత్సలు చేయించుకున్న రోగులను పరామర్శించారు. అనంతరం ఆప్తమాలజీ విభాగాన్ని ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ కంటి వైద్యం ఖరీదైనదని, పేదలు అంత ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేరనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి లక్షలాది మందికి కళ్ల జోళ్లు అందజేశారన్నారు. కాగా.. గతంలో రెండేళ్లపాటు ఎమ్మెల్యే వెంకట్రావు భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసి.. ఎన్నో క్లిష్టమైన శస్త్ర చికిత్సలు చేసి ఎంతో మంది ప్రాణాలు నిలిపారు.
డాక్టర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన డాక్టర్ వెంకట్రావుకు ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ పుష్పగుచ్ఛం అందజేయగా.. నర్సింగ్ సూపరింటెండెంట్, నర్సింగ్ సిబ్బంది ఆయనను శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం కంటి వైద్యులు, గైనకాలజిస్ట్ను ఆయన శాలువాతో ఘనంగా సన్మానించి.. గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లు, సిబ్బందికి తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, నక్కా ప్రసాద్, తాళ్లపల్లి రమేశ్ గౌడ్, నర్రా రాము, ఎండీ నవాబ్, ఆర్ఎంవో వైఎస్.రాజశేఖర్రెడ్డి, డాక్టర్ సుమన్, డాక్టర్ విజయారావు, నర్సింగ్ సూపరింటెండెంట్ భవాని, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.