తల్లాడ, సెప్టెంబర్ 21: సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో రాష్ర్టాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తల్లాడ మండలంలో గురువారం పర్యటించిన ఆయన.. కుర్నవల్లి – పుణ్యపురం మధ్య రూ.3.10 కోట్లతో చేపట్టిన రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులకు, బస్వాపురం – పెద్దకోరుకొండి మధ్య రూ.4.90 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ పాలకులు చేయని అభివృద్ధిని.. తొమ్మిదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని స్పష్టం చేశారు. పేదలకు అండగా ఉండి ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అధించిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. అందుకని ఆయన మరోసారి కూడా ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్నారు. అభివృద్ధి కాముకులను గుర్తించి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. అయితే, ఎన్నికల సమయంలో ప్రజలను రెచ్చగొట్టేందుకు కొందరు నాయకులు వస్తారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆరు హామీలంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్.. తాను అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు ఇలాంటి పథకాలు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా కరెంట్ సమస్యను పరిష్కరించలేదని విమర్శించారు. దీంతో అక్కడి ప్రజలు రోడ్డెక్కుతున్నారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు రాయల వెంకటశేషగిరిరావు, దొడ్డా శ్రీనివాసరావు, దిరిశాల ప్రమీల, అయిలూరి లక్ష్మి, అన్నెం కళావతి, అయిలూరి ప్రదీప్రెడ్డి, సూరంపల్లి లక్ష్మీనారాయణ, ఆదూరి వెంకటేశ్వర్లు, రెడ్డెం వీరమోహన్రెడ్డి, దుగ్గిదేవర వెంకట్లాల్, రవికుమార్, కొండపల్లి శ్రీదేవి, హేమలత, ఖలీల్, రాంబాబు, అశోక్, దిరిశాల దాసురావు, అన్నెం కోటారెడ్డి, పోతురాజు వెంకటయ్య, అయిలూరి కృష్ణారెడ్డి, ఎక్కిరాల వెంకటేశ్వర్లు, ఉప్పర్ల రామారావు, శీలం కోటారెడ్డి, బద్ధం కోటిరెడ్డి, జొన్నలగడ్డ కిరణ్బాబు, కోడూరి వీరకృష్ణ, వజ్రాల రామిరెడ్డి, జీవీఆర్, అయిలూరి శివారెడ్డి, తేళ్లూరి రఘు పాల్గొన్నారు.