కల్లూరు, అక్టోబర్ 27 : నవంబర్ 1న కల్లూరులో జరిగే బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. మండల వ్యాప్తంగా 31 పంచాయతీల నుంచి ప్రతి బూత్లెవల్ నాయకుడు గ్రామప్రజలను సుమారు 25వేల మందికి తగ్గకుండా కేసీఆర్ సభకు జనసమీకరణ చేయాలని కార్యకర్తలకు సూచించారు. నాయకులు ముందే గ్రామాల్లో ఉన్న వాహనాలను సిద్ధం చేసుకుని ప్రజలతో పాటు నాయకులు తరలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. తిరువూరు క్రాస్ రోడ్లోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలోని 50 ఎకరాల స్థలంలో సీఎం బహిరంగ సభావేదికను సిద్ధం చేస్తున్నామని, నవంబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమవుతుందని తెలిపారు.
అలాగే సభ ప్రారంభానికి ముందే ప్రాంగణానికి నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు భారీగా తరలిరావాలని సూచించారు. సభా ప్రాంగణానికి వచ్చిన ప్రజలు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. బహిరంగ సభలో తెలంగాణ గాయని, ప్రఖ్యాత సింగర్ మధుప్రియ బృందంచే ఉదయం 11 గంటల నుంచే తెలంగాణ గేయాలు, కళారూపాలను ప్రదర్శించనున్నారని ఎమ్మెల్యే సండ్ర పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, జడ్పీటీసీ కట్టా అజయ్బాబు, ఎంపీపీ బీరవల్లి రఘు, మండల రైతుబంధు సమితి సభ్యులు లక్కినేని రఘు, కాటంనేని వెంకటేశ్వరరావు, బోబోలు లక్ష్మణరావు, పెడకంటి రామకృష్ణ, కొరకొప్పు ప్రసాద్, వివిధ పంచాయతీల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.