సత్తుపల్లి, ఫిబ్రవరి 24: గ్రంథాలయాలు సరస్వతీ నిలయాలని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసినందున యువతీయువకులు ఈ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పట్టణంలో రూ.2.50 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. రూ.30 లక్షతో గాంధీనగర్లో చేపట్టిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, మరో రూ.30 లక్షలతో వివేకానంద ఎక్సలెన్సీ సెంటర్ నిర్మాణానికి, బస్టాండ్ వద్ద తన సొంత ఖర్చులతో నిర్మించతలపెట్టిన నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి కూడా శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు గురువులాంటి వారని అన్నారు. తనను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసినప్పుడే.. సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలని సూచించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఓ పెద్ద లైబ్రరీ లాంటి వారని, ఆయనతో మాట్లాడితే ఓ విజ్ఞానభాండాగారాన్ని చదివినట్లుగా అనిపిస్తుందని అన్నారు. సత్తుపల్లిలో నిర్మిస్తున్న ఈ గ్రంథాలయం తెలంగాణకే తలమానికంగా నిలిచేలా తీర్చిదిద్దుతామన్నారు. .
పార్థసారథిరెడ్డి.. ఆపద్భాంధవుడు: ఎమ్మెల్యే సండ్ర
రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి సత్తుపల్లి నియోజకవర్గానికి ఆపద్బాంధవుడని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. గంథాలయ నిర్మాణాన్ని ఆగస్టు 15లోగా పూర్తిచేసి సత్తుపల్లి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు.
గ్రంథాలయం ఎంతో ఉపయోగం: కలెక్టర్ గౌతమ్
రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి తన సొంత ఖర్చులతో నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మించడం అభినందనీయమని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. తొలుత ఆయా వార్డుల్లో మహిళలు, ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు.. అతిథులలకు మేళతాళాలు, పూలతో ఘన స్వాగతం పలికారు. అధికారులు, ప్రజాప్రతినిధులు శివాజీ, శ్రీనివాసరావు, సుభాషిణి, సుజాత, హేమలత, కూసంపూడి మహేశ్, తోట సుజలారాణి, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, దొడ్డా హైమావతి, కూసంపూడి రామారావు, చల్లగుళ్ల కృష్ణయ్య, నాయకులు పాల్గొన్నారు.