వేంసూరు, నవంబర్ 15: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ అధోగతి తప్పదని.. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బుధవారం ఆయన రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డితో కలిసి మండలంలోని దుద్దెపూడి, కందుకూరు, భరణిపాడు, వెంకటాపురం, అమ్మపాలెం, కుంచపర్తి, చిన్నమల్లేల, జయలక్ష్మీపురం, కేజీ మల్లేల, శంభునిగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ.. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని, ఇప్పుడొచ్చి ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మభ్య పెడుతున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మండలానికో ఎమ్మెల్యే పుట్టకొస్తాడని, పెత్తనం కోసం కోట్లాటలు తప్ప ప్రజల బాధలు వారికి పట్టవని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో గెలిపిస్తే తాను సత్తుపల్లిలో ఐటీ టవర్, శిల్పారామం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న దళితులందరికీ దళితబంధు వర్తింపజేస్తామన్నారు. అర్హులైన బీసీలందరికీ ప్రభుత్వం నుంచి రూ.లక్ష చేయూత అందిస్తానని హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వల్లనే తాను రాజ్యసభ సభ్యుడిని అయ్యానని, ప్రజలకు మరింత సేవలు అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందని అన్నారు. లింగపాలెం నుంచి బీఆర్ఎస్లో చేరిన వారిలో గొల్లముడి ముఖేష్, సింగపోగు త్రినాథ్, ఉప్పునూరి విక్కిటర్, మేకల ద్రావిడ్, కాకాని అజయ్, సింగపోగు మనోజ్, గద్దల కిరణ్, గద్దల రవి ఉన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పగుట్ల వెంకటేశ్వరరావు, మారోజు సుమలత, పాల వెంకటరెడ్డి, గొర్ల సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.