వేంసూరు, నవంబర్ 28: తెలంగాణ అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా ఉందామని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించుకుందామని అన్నారు. అలాగే, కందుకూరు గ్రామంలో పూర్తి మెజార్టీ సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ గ్రామ విజయాన్ని గిఫ్ట్గా ఇద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం చివరిరోజైన మంగళవారం రోజు వేంసూరు మండలం కందుకూరులో వెయ్యి మంది మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు.
ఈ పథకాలన్నీ ప్రతి ఒక్క కుటుంబంలోనూ వెలుగులు నింపాయని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోనే కందుకూరు గ్రామం చరిత్ర సృష్టించాలని ఆకాంక్షించారు. తన విజయాన్ని కాంక్షించి ఇంతమంది ఆడబిడ్డలు గులాబీ సైనికుల్లా తరలిరావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తన ఎన్నికల ప్రచారాన్ని కందుకూరు గ్రామంలో ముగించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 30న జరుగనున్న ఎన్నికల్లో మొదటి ఈవీఎంలోని 5వ నెంబరులో ఉన్న కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు గొర్ల సంజీవరెడ్డి, మందపాటి వెంకటరెడ్డి, గొర్ల ప్రభాకర్రెడ్డి, ఉపేందర్రెడ్డి, చల్లా రవీందర్రెడ్డి, రాయల సత్యనారాయణ, మురళీ, బూరుగు ఇసాక్, జబ్బురి నాగరాజు పాల్గొన్నారు.