వేంసూరు, ఏప్రిల్ 26: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని స్పష్టం చేశారు. ఈ నెల 29న మండలంలోని వెంకటాపురంలో జరుగనున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమ్మేళనానికి రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు చెప్పారు. మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఆత్మీయ సమ్మేళనం జరిగే ప్రదేశాన్ని పార్టీ నేతలతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే మండలంలో బీరాపల్లి సత్తెమ్మగుడి వద్ద 16 గ్రామ పంచాయతీల ఆత్మీయ కుటుంబ సమావేశాన్ని నిర్వహించుకున్నామని, రెండో ఆత్మీయ కుటుంబ సమావేశాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు పాల వెంకటరెడ్డి, కంటే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి, ఏప్రిల్ 26: సత్తుపల్లి నియోజకవర్గంలో రైతుల ధాన్యం కొనుగోలుపై వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సండ్ర సమీక్షించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, సివిల్ సప్లయి, వ్యవసాయ శాఖల అధికారులతో కల్లూరు ఆర్డీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు, మిల్లుల కేటాయింపు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. అయితే ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ ప్రతీ మిల్లులో 1000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి చేసుకోవాలని అధికారులను, మిల్లర్లను ఆదేశించారు. డీఎస్వో రాజేందర్, ఆర్డీవో సూర్యనారాయణ, ఏడీఏలు సరిత, నర్సింహారావు, అధికారులు పాల్గొన్నారు.