సత్తుపల్లి: మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో శ్రీషిరిడీసాయి జనమంగళం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించనున్న షిరిడీసాయిబాబా ఆలయ నిర్మాణంతో పాటు ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ దైవసంకల్పంతో నిర్మించనున్న 250 పడకల ఆసుపత్రికి నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా మౌలిక సదుపాయాలు కల్పించడానికి ముందుంటానన్నారు.
ఇప్పటికే మట్టి తోలకం, విద్యుత్ పనులను పూర్తిచేయడం జరిగిందని, సత్తుపల్లి నియోజకవర్గంలో ఇలాంటి కార్పొరేట్ ఆసుపత్రులు ఏర్పాటు కావడం అదృష్టమని, నిరుపేదలకు వీటి ద్వారా ఉచిత వైద్యం అందుతుందన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో ఆసుపత్రి, ఆలయ నిర్మాణానికి నారాయణపురం గ్రామస్తులు తమ భూములు విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈనెల 28న ఆసుపత్రి నమూనాను రాష్ట్ర ఆర్ధిక, వైద్యశాఖామంత్రి తన్నీరు హరీష్రావు, డీఆర్డీవో చైర్మన్ సతీష్రెడ్డిల చేతులమీదుగా హైదరాబాద్లో ఆవిష్కరించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమానికి పార్టీలతో సంబంధంలేకుండా ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సర్పంచ్ రంగారెడ్డి, ఆత్మచైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, సొసైటీ అధ్యక్షులు మందపాటి వెంకటరెడ్డి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, ఎంపీటీసీలు తుమ్మూరు కృష్ణారెడ్డి, పిడుగు సత్యం, నాయకులు మట్టా ప్రసాద్, మోరంపూడి ప్రభాకర్, అప్పారావు, మాధవి తదితరులు ఉన్నారు.