కల్లూరు: దేశానికి అన్నం పెట్టే రైతన్నకు నష్టం వాటిల్లే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, దీనిని మానుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కల్లూరు మండల కేంద్రంలో మండల పరిధిలో అన్ని గ్రామాల రైతులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ కల్లూరు అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో భాగంగా నాయకులు, రైతులతో కలిసి ఆయన ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయం గురించి నినాదాలు చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్దం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుపక్షపాతి ప్రభుత్వంగా వ్యవహరిస్తూ రైతులకు అవసరమైన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచి 30లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తెలంగాణవ్యాప్తంగా పండించి రైతులపక్షపాతిగా ఉన్న ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని కేంద్ర ప్రభుత్వం కుటిల ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కట్టా అజయ్బాబు, జిల్లా, మండల రైతుసమన్వయ సమితి సభ్యులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, వివిధ గ్రామాల రైతులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, గ్రామకమిటీ అధ్యక్షులు, అనుబంధ, యువజన సంఘాలనాయకులు పాల్గొన్నారు.