కొణిజర్ల, మార్చి 28: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలో అగ్రగామిగా నిలిచిందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణతో పోటీపడే రాష్ర్టాలే లేవంటే అతిశయోక్తి కాదని స్పష్టం చేశారు. మండలంలోని మంగాపు రం డీవీఆర్ గార్డెన్లో మంగళవారం నిర్వహించిన పలు పంచాయతీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘకాలం పోరాడి స్వరాష్ర్టాన్ని తెచ్చిన సీఎం కేసీఆర్.. కేవలం ఎనిమిదిన్నరేళ్లలోనే తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశా రు. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎకరాకు రూ.10 వేల పరిహారాన్ని ప్రకటించారని, రైతుల గోడును చూసిన రెండు గంటల్లోనే నిధులు కేటాయించారని వివరించారు. సీఎం కేసీఆర్తోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. కార్యకర్తలే పార్టీకి బలమని, భవిష్యత్తు అంతా బీఆర్ఎస్దేనని స్పష్టం చేశారు. శ్రేణులంతా సమష్టిగా శ్రమించి కేసీఆర్ను మూడోసారీ సీఎంను చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు వై.చిరంజీవి, ఏలూరి శ్రీనివాసరావు, పోట్ల కవిత, పోట్ల శ్రీనివాసరావు, దొడ్డపునేని రామారావు, డేరంగుల బ్రహ్మం, బండారు కృష్ణ, కిలారు మాధవరావు, చెరుకుమల్లి రవి, బీ.మదన్, చల్లా మోహన్రావు, రాయల నాగేశ్వరరావు, భూక్యా మాన్సింగ్, భుక్యా మాన్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు..
మండలంలోని గుబ్బగుర్తికి చెందిన వివిధ పార్టీల నాయకులు వైరా ఎమ్మెల్యే రాములునాయక్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మంగాపురంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో బలమాల శ్యాంబాబు సహా మరో ఐదుగురికి ఎమ్మెల్యే రాములునాయక్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
సీఎం కేసీఆర్తోనే సుపరిపాలన..
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన అందుతోంది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం స్థితిగతులు, రూపురేఖలు మారిపోయాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు లాంటి పథకాలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుంది.
-అడపా శంకరయ్య, రామచంద్రాపురం
కొండంత అండగా రైతుబంధు..
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు అన్నదాతలకు ఎంతో మేలు చేస్తున్నాయి. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను తెరిచి మద్దతు ధర అందిస్తుండడం గొప్ప విషయం. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం అందించడం సంతోషకరం.
-బలమాల తిరుపతి, పెద్దరాంపురం
అన్ని రంగాల్లో అభివృద్ధి
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తోంది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. సంక్షేమ పథకాలు మా కుటుంబానికీ అందాయి.
– మంకెన శివ, సింగరాయపాలెం