కొత్తగూడెం అర్బన్, జనవరి 9: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఆరు నెలల సమయం ఇచ్చామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అవసరమైతే ఆ హామీల అమలు కోసం ప్రభుత్వంపై పోరాడేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. పేదల పక్షాన పోరాడుతూనే నియోజకవర్గంలో పేరుకపోయిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుకనవుతానని స్పష్టం చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రమజీవులకు అండగా ఉండేది ఎర్రజెండా మాత్రమేనని అన్నారు. కమ్యూనిస్టుల గొంతు వినిపించాలనే ఉద్దేశంతోనే ప్రజలు తనను ఈ ప్రాంతం నుంచి అసెంబ్లీకి పంపారని అన్నారు. వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఇక్కడి ప్రజల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడతానని స్పష్టం చేశారు.
ఈ ప్రాంతంలో నూతన బొగ్గు బావులను తీసుకొచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. సింగరేణి ఎన్నికల్లో సైతం గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీకి బొగ్గు గని కార్మికులు అగ్రస్థానం ఇచ్చారని, సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. నూతన బొగ్గు గనులు వస్తేనే సింగరేణికి భవిష్యత్ ఉంటుందని అన్నారు. ప్రభుత్వం కూడా నూతన బొగ్గు గనుల ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. కొత్తగూడెం పట్టణాభివృద్ధికి బృహత్తర కార్యక్రమాలను చేపట్టబోతున్నామని అన్నారు. సీపీఐ, అనుబంధ సంఘాల నాయకులు సాబీర్పాషా, వాసిరెడ్డి సీతారామయ్య, దుర్గరాశి వెంకన్న, రాజ్కుమార్, మురళి, జమలయ్య, దస్రు, చంద్రగిరి శ్రీనివాస్, వంగా వెంకట్ తదితరులు పాల్గొన్నారు.