ఇల్లెందు రూరల్, సెప్టెంబర్ 13: బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయిస్తోందని అన్నారు. ఎస్టీఎస్డీఎఫ్ నిధులతో మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు బుధవారం ఆమె శంకుస్థాపన చేసి మాట్లాడారు. కొమరారం – లక్ష్మీనారాయణ తండా రూ.కోటితో నిర్మించే సీసీ రోడ్డు పనులకు, మాణిక్యారం – దేశియాతండా మధ్య రూ.57 లక్షలతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు, పోచారం తండా, మొండితోగు, తిలక్నగర్, బోయితండాల్లో ఒక్కో చోట రూ.20 లక్షల చొప్పున నిర్మించే నూతన పంచాయతీ భవనాలకు, గుండాల ఆర్ఎండ్బీ రోడ్డు – సుంకరిగూడెం మధ్య రూ.1.40 కోట్లతో చేపట్టిన బీటీ, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణాలకు, అలాగే, చీమలపాడు పంచాయతీ రోడ్డు – తంగెళ్లగడ్డ స్టేజీ – బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.
మొత్తం ఈ అభివృద్ధి పనులకు రూ.6.50 కోట్లను వెచ్చించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ సహకారంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకూ రహదారి సౌకర్యం కలిగిందని అన్నారు. నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు, భవనాల నిర్మాణంతో పరిపాలన ప్రజలకు మరింత చేరువైందని వివరించారు. అందుకని సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని, రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో బీఆర్ఎస్కు భారీ మెజార్టీ అందించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు దిండిగాల రాజేందర్, సలార్, దాస్యం ప్రమోద్, మెట్ల కృష్ణ, జనగం కోటేశ్వరరావు, శీలం రమేశ్, ఖమ్మంపాటి రేణుక, మంకిడి కృష్ణ, నందునాయక్, బానోత్ సంతు, బోడ మురళి, తాండ్ర నాగరాజు, బండారి శ్రీను, పూణెం కమల, నూనావత్ లష్కర్, పోలేపల్లి నాగేశ్వరరావు, నీలం రాజశేఖర్, ఘాజీ, మూడ్ హనుమాన్, గుడిబండ్ల శ్యామ్, మహేశ్, రాజేశ్వరి, కవిత, సుధాకర్, సదానందం, కుమార్ తదితరులు పాల్గొన్నారు.