నాడు ఎండిపోయిన చెరువులు ఇప్పుడు నిండు వేసవిలోనూ జలకళను సంతరించుకున్నాయి.. నెర్రెలు బారిన భూముల ఎదపై సిరులు కురిపించే పంటలు పండుతున్నాయి.. తొండలు గుడ్లు పెట్టని భూములు ప్రస్తుతం బంగారు భూములయ్యాయి.. భూముల ధరలకు అమాంతం రెక్కలు వచ్చాయి.. ఇన్ని మార్పులు తెచ్చింది ఒకే ఒక పథకం.. అదే ‘మిషన్ కాకతీయ’. ఈ పథకంలో భాగంగా విడతల వారీగా చెరువుల పునరుద్ధరణ జరిగింది. చెరువు కట్టలు పటిష్టమయ్యాయి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నేడు ఊరూరా చెరువుల పండుగ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ‘మిషన్’ సక్సెస్పై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
– ఖమ్మం, జూన్ 7
ఖమ్మం, జూన్ 7: ఉమ్మడి పాలనలో సాగు విస్తీర్ణం అంతంతమాత్రంగా ఉండేది. చెరువుల్లో పూడిక చేరి నిరర్ధకంగా ఉండేవి. వానకాలంలో వానలు ఎక్కువగా కురిస్తే చెరువులకు గండ్లు పడేవి. ఊళ్లకు ఊళ్లు మునిగిపోయేవి.. పంటలు చేతికొచ్చేవి కాదు. భూగర్భజలాలు అడుగంటి బోర్లు నోరు తెరుచుకుని ఉండేవి. కానీ.. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నారు. కాకతీయుల స్ఫూర్తిగా ‘మిషన్ భగీరథ’ పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేశారు. పథకంలో భాగంగా ఉభయ జిల్లాల పరిధిలోని 3,680 చెరువుల పునరుద్ధరణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్-1 పనులకు రూ. 214.29 కోట్లు, ఫేజ్-2 పనులకు రూ.291.39 కోట్లు, ఫేజ్-3 పనులకు రూ.129.87 కోట్లు, ఫేజ్ -4 పనులకు రూ. 72.34 కోట్లు ఖర్చు చేసింది. చెరువుల్లో పూడిక తీయించింది. చెరువు కట్టలను పటిష్టపరిచంది. దీంతో సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం రెండు జిల్లాల పరిధిలో చెరువుల కింద 2,30,623 ఎకరాల ఆయకట్టు సాగు అవుతున్నది.
పెరిగిన భూగర్భజలాలు..
చెరువుల పునరుద్ధరణతో ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అమాంతం పెరిగాయి. బావుల్లో ఊట ఉబికి ఉబికి వస్తున్నది. అతి తక్కువ మీటర్లలోనే బోర్లలో నీళ్లు పడుతున్నాయి. గతంలో అతి కష్టంగా కేవలం వానకాలంలో పంటలు సాగు చేసిన రైతులు ఇప్పుడు ఏటా రెండు పంటలు పండిస్తున్నారు. గతంలో కేవలం వరి, మిర్చి, పత్తి పండించిన రైతులు ఇప్పుడు ఆరుతడి పంటలైన మొక్కజొన్న, పెసర, మినుములూ పండిస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు వ్యవసాయ కూలీలకు కూలి పనులు ఎక్కువగా దొరుకుతున్నాయి. కూలీలు ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి కడుపు నిండా బోజనం చేస్తున్నారు.
నియోజకవర్గానికో మినీ ట్యాంక్బండ్..
ఒకప్పుడు నగరాలు, పట్టణాలకు పరిమితమైన ట్యాంక్బండ్ సంస్కృతి ఇప్పుడు నియోజకవర్గాలకూ చేరువైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఓ పెద్ద చెరువును ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దింది. ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పది చెరువులు ట్యాంక్బండ్స్ లేదా మినీ ట్యాంక్బండ్స్గా మారాయి. చెరువు కట్ట వెలుపల టార్ఫింగ్ (పచ్చగడ్డి అతికించడం) చేపట్టింది. కొన్ని చెరువుల వద్ద బోటు షికారు ఏర్పాటు చేసింది. పిల్లలకు ఆట వస్తువులు, పెద్దల కోసం వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసింది.
నేడు చెరువుల వద్ద పండుగ
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఇరిగేషన్, పంచాయతీరాజ్, మత్స్యశాఖ ఆధ్వర్యంలో ‘చెరువుల వద్ద పండుగ’ కార్యక్రమాలు జరుగనున్నాయి. అన్నిశాఖల అధికారులు కార్యక్రమాల్లో భాగస్వాములు కానున్నారు. మత్స్యకారులు వలలు, వారి జీవనోపాధి సామగ్రితో చెరువు కట్టల వద్ద ప్రదర్శన నిర్వహించనున్నారు. మహిళలు బతుకమ్మ, బోనాలతో చెరువుల వద్దకు తరలిరానున్నారు. అనంతరం పండుగ వాతావరణంలో ప్రజలు సహపంక్తి భోజనాలు చేయనున్నారు.
చేతివృత్తిదారులకు మంచిరోజులు..
చెరువుల్లో నిత్యం నీరు ఉంటుండడంతో మత్స్యకారులకు చేపల పెంపకమూ సులభతరమైంది. మత్స్యకారులు సంఘాలుగా ఏర్పడి చెరువుల్లో చేపలు పెంచుతున్నారు. చెరువుల్లో చేపలను పట్టి ఉపాధి పొందుతున్నారు. చెరువు కట్టలపై మొలిచిన తాటి, ఈత చెట్లతో కల్లు గీత కార్మికులు ఉపాధి పొందుతున్నారు. చెరువుల్లో ఎల్లప్పుడూ నీరు ఉంటుండడంతో రజకులు సులువుగా బట్టలు ఉతికేందుకు వీలు కలిగింది. గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడంతో పాత వైభవం ఇప్పుడు గ్రామాల్లో కనిపిస్తున్నది. ఒకవైపు పంటలు కళకళలాడుతూ రైతులు దర్జాగా వ్యవసాయం చేసుకుంటుంటే మరోవైపు చేతివృత్తిదారులూ తాము నమ్ముకున్న కుల వృత్తి చేసుకుంటున్నారు.