మధిర, ఆగస్టు 04 : ప్రమాదవశాత్తు చెరువులో పడిన మత్స్యకార అన్నదమ్ములిద్దరూ గల్లంతైన సంఘటన చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. వీరి మృతదేహాలు సోమవారం లభించాయి. వివరాలు ఇలా ఉన్నాయి. నాగులవంచ గ్రామానికి గ్రామానికి చెందిన కంభం నాగేశ్వరరావు (55), సత్యనారాయణ (50) రెడ్డి చెరువును లీజుకు తీసుకుని చేపల పెంపకం చేపడుతున్నారు. అన్నదమ్ములిద్దరూ ఆదివారం సాయంత్రం చేపలకు మేత వేసేందుకు చెరువులోకి వెళ్లారు.
రాత్రి అయినప్పటికీ నాగేశ్వరరావు, సత్యనారాయణ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లారు. చెరువు ప్రాంతంలో వారి కోసం గాలించినప్పటికీ ఆచూకీ అభ్యం కాలేదు. చెరువు కట్టపై బైక్, దుస్తులు ఉన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే గజ ఈతగాళ్లతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో ప్రయత్నం ఫలించలేదు. సోమవారం ఉదయం చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరి మృతదేహాలు లభించాయి. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.