ఖమ్మం సిటీ, సెప్టెంబర్ 14 : దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకో వైద్య కళాశాలను మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఖమ్మం జిల్లా సార్వజనీన ఆసుపత్రికి అనుసంధానంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాతా మధు, పల్లా రాజేశ్వరరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో కలిసి గురువారం సూత్రప్రాయంగా ప్రారంభించారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు, బయోకెమిస్ట్రీ ల్యాబ్, మ్యూజియం, హెమటాలజీ, ఫిజియాలజీ ల్యాబ్లతోపాటు టీచింగ్ గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ స్వల్ప కాలంలోనే ఖమ్మం మెడికల్ కళాశాల(కేఎంసీ)ను ముస్తాబు చేశారని ప్రశంసించారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాల తరగతులను శుక్రవారం సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని వెల్లడించారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పలుమార్లు ఒత్తిడి చేసిన కారణంగానే ఖమ్మానికి మెడికల్ కళాశాలను మంజూరు చేశామని అన్నారు.
తెలంగాణలో జిల్లాకో మెడికల్ కళాశాలను మంజూరు చేయడం దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. గతంలో వైద్య విద్య ఎంతో ఖర్చుతో కూడుకుని ఉన్నందున పేద, మధ్యతరగతి వర్గాలు ఆ దిశగా దృష్టి సారించేవారు కాదన్నారు. కానీ.. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా రాష్ట్రంలో మెడికల్ సీట్లు గణనీయంగా పెరిగాయన్నారు. తద్వారా సామాన్య విద్యార్థుల్లో సైతం డాక్టర్లు కావాలనే పట్టుదల, తపన పెరిగిందని వ్యాఖ్యానించారు. అతి తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని మంత్రి స్పష్టం చేశారు. మనకోసం ఇంతగా ఆలోచిస్తున్న ముఖ్యమంత్రికి ప్రతీ ఒక్కరూ అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రజానీకానికి నిరంతరం వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాలోని వైరా, మధిర, కల్లూరు, పెనుబల్లి, తిరుమలాయపాలెం వంటి అనేక దవాఖానలను అప్గ్రేడ్ చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, బానోతు హరిప్రియానాయక్, కలెక్టర్ వీపీ గౌతమ్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ బీ.మాలతి, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు బాలసాని లక్ష్మీనారాయణ, బానోత్ మదన్లాల్, ఆర్జేసీ కృష్ణ, దిండిగాల రాజేందర్, పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, రాపర్తి శరత్ పాల్గొన్నారు.
ఖమ్మం మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్రావు, పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతోపాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం లభించింది. నగర బీఆర్ఎస్ శ్రేణులు, కార్పొరేటర్ల సారథ్యంలో యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు.