ఖమ్మం సిటీ, ఫిబ్రవరి 5 : ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి రూ.108 కోట్ల వ్యయంతో కొత్త భవనాలు వస్తాయని, వాటన్నింటికీ అవసరమైన స్థల సర్దుబాటుపై అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీని సోమవారం సందర్శించిన మంత్రి తుమ్మల ప్రాంగణం మొత్తాన్ని స్వయంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ వీపీ గౌతమ్, వైద్యాధికారులతో కలిసి కాలేజీ భవనంలో సమీక్ష చేశారు. ప్రస్తుతమున్న వసతులు, భవిష్యత్ అవసరాలపై సమగ్రంగా చర్చించారు. జిల్లా ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాలని, వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నూతన కలెక్టరేట్ నిర్మించినందున పాత కలెక్టరేట్ భవనాలను మెడికల్ కాలేజీకి అప్పగించారన్నారు.
దాదాపు రూ.10 కోట్లతో రెన్నోవేషన్ పనులు చేపట్టారన్నారు. రెండో సంవత్సరం నుంచి మరో వంద మంది విద్యార్థులు వస్తారని, భవిష్యత్ అవసరాలకు ఈ భవనం సరిపోతుందో.. లేదో.. పరిశీలించాలని అధికారులకు సూచించారు. రాబోయే విద్యార్థులకు మంచి వైద్య కళాశాలను అందించడమే తమ లక్ష్యమని, ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో ఇంచార్జ్ డీఎంహెచ్వో డాక్టర్ రాములునాయక్, మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సీ సరిత, ఆర్అండ్బీ ఎస్ఈ శ్యామ్ప్రసాద్, వైద్య శాఖ ఈఈ ఉమామహేశ్వరరావు, వివిధ విభాగాల అధికారులు డాక్టర్ ఎల్.కిరణ్కుమార్, డాక్టర్ బీ బాబూరత్నాకర్, డాక్టర్ రాథోడ్ వినాయక్, డాక్టర్ ఎం.రాధిక, డాక్టర్ బీ దివ్యదర్శిని, డాక్టర్ డీ చండీప్రియ, డాక్టర్ జీ కరిష్మ, ఆర్ఎంవోలు డాక్టర్ అమర్సింగ్, డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.