ఖమ్మం, జనవరి 12 : వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు ధర నిర్ణయించిన తర్వాత కాంటాలో కోతలు ఎందుకు పెడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్ కార్యదర్శిని ప్రశ్నించారు. ఖమ్మం వ్యవసాయ మారెట్ను మంత్రి తుమ్మల శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిర్చి యార్డులో మారెటింగ్ శాఖ అధికారులతో కలిసి మంత్రి కలియ తిరిగారు. రైతు విక్రయానికి తీసుకొచ్చిన మిర్చి పంటను పట్టుకుని నాణ్యతను పరిశీలించారు. యార్డులో మిర్చి నాణ్యతను పరిశీలించే అధికారి ఎక్కడ ఉన్నాడని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వాలిటీ మిర్చికి వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తుంటే.. అధికారులు ఎందుకు పర్యవేక్షించడం లేదని మండిపడ్డారు.
మార్కెట్కు సరుకు తెచ్చిన రైతులు మోసపోకుండా ఇతర శాఖలను సమన్వయం చేసుకుని వ్యాపారులకు నిర్దేశం చేయాలని సూచించారు. ఈ క్రమంలోనే రైతుల లాట్ల వద్దకు వెళ్లి ‘ఎంత పంట వేశారు.. ఖర్చు ఎంత.. దిగుబడి ఎంత వచ్చింది’ అని మంత్రి అడిగి తెలుసుకున్నారు. రైతులు మాత్రం క్వింటా మిర్చి గత ఏడాది రూ.14 వేలు పలికితే.. ఈ ఏడాది రూ.10 వేలు ధర పెట్టి మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మారెటింగ్ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. తనిఖీలో మంత్రి వెంట రాష్ట్ర మారెటింగ్ శాఖ వ్యవసాయ సంచాలకులు లక్ష్మీభాయి, డైరెక్టర్ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి విజయనిర్మల, మారెట్ డీఎం అలీం తదితరులు ఉన్నారు.