రఘునాథపాలెం, మార్చి 6 : రైతు సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు నేస్తం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ ప్లాట్ఫాం ద్వారా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు అందించే రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీ వెంకటాయపాలెం రైతు వేదికలో ఖమ్మం నియోజకవర్గ రైతుల కోసం ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ను ఉద్దేశించి మంత్రి తుమ్మల మాట్లాడారు.
రైతులు పంటలు వేసే సీజన్లో ఉత్పన్నమయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని తగిన సలహాలు, సూచనలు చేసేందుకు ‘రైతు నేస్తం’ దోహదపడుతుందన్నారు. శాస్త్రవేత్తలు, అధికారులు, రైతుల మధ్య ప్రత్యక్ష, పరస్పర విషయ మార్పిడికి రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థతో జూమ్, యూట్యూబ్ లైవ్లో అందించనున్నట్లు తెలిపారు. వీసీలో కలెక్టర్ వీపీ గౌతమ్, వివిధ శాఖల అధికారులు, మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.