ఖమ్మం, మార్చి 15: ఖమ్మాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి నగరాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఖమ్మంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 2, 5, 8, 27, 49, 57 డివిజన్లలో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెనేజీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, 15వ డివిజన్లో రూ.2.50 కోట్లతో చేపట్టిన ఖమ్మం – కొదుమూరు నాలుగు లైన్ల రహదారి విస్తరణ, అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేశారు.
అనంతరం వికలాంగుల కాలనీ వద్ద నగరపాలక సంస్థ సిబ్బందికి చెందిన సెప్టిక్ ట్యాంక్ క్లినింగ్ వాహనాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు త్వరతగతిన పూర్తి చేయాలని, పనులను నాణ్యంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పునుకొల్లు నీరజ, ఆదర్శ్ సురభి, శ్యామ్ప్రసాద్, చంద్రమౌళి, రంజిత్, కృష్ణలాల్, కమర్తపు మురళి, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మలీదు వెంకటేశ్వర్లు, రావూరి కరుణ సైదుబాబు తదితరులు పాల్గొన్నారు.