ఖమ్మం, జనవరి 16 : రైతులకు నష్టం వాటిల్లే చర్యలు చేపట్టవద్దని, వారికి అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు ముందుగానే సమకూర్చాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ డైరెక్టర్కు సూచించారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో నమోదైన యూరియా కొరతకు సంబంధించిన సమస్యపై సమీక్షించారు.
దీనిపై వ్యవసాయ సంచాలకులు వివరిస్తూ.. ఇటీవల జరిగిన లారీల సమ్మె కారణంగానే యూరియా కొరత ఏర్పడిందని, వారు సమ్మె నిలిపివేయడంతో సమస్య పరిష్కారమైందన్నారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని తెలిపారు. అలాగే మిర్చి ధర, తెగుళ్ల నియంత్రణ, మారెట్లో ఇటీవల తలెత్తిన పలు అంశాలపై సమీక్షించారు. రైతుల ఆదాయం పెంచడం, పంటల్లో వైవిధ్యాన్ని పెంచడంపై అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను సమర్థంగా వినియోగించుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. అధిక వరి పంటను ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ ఉద్యోగులు, అన్ని సంఘాల ప్రతినిధులతో వారి సమస్యలపై సమీక్ష నిర్వహించాలని వ్యవసాయ సంచాలకులను మంత్రి ఆదేశించారు.