ఖమ్మం, జనవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మే నెలాఖరు కల్లా సీతారామ ప్రాజెక్ట్ పరిధిలోని అన్ని కాలువల పనులు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఆదివారం హైదరాబాద్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి నీటి పారుదలశాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పనుల్లో వేగం పెంచితే ఈ ఏడాదిలోనే వైరా రిజర్వాయర్, లంకాసాగర్ చెరువు, ఎన్నెస్పీ ఆయకట్టులోని సుమారు 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. ఏనూరు వద్ద లింకు కెనాల్ పనులకు టెండర్లు పూర్తి చేసి, పనులు మొదలుపెట్టాలన్నారు. యాతాలకుంటలో భూసేకరణ పూర్తయితే సత్తుపల్లి టన్నెల్ ద్వారా లంకసాగర్, బేతుపల్లి కెనాల్కు ఈ సీజన్లో సాగునీరు ఇవ్వొచ్చన్నారు. సత్తుపల్లి కెనాల్కు సంబంధించి భూసేకరణకు రూ.12 కోట్లు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పాలేరు టన్నెల్ పనులనూ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తయితే పాలేరు రిజర్వాయర్కూ జలాలు తీసుకురావొచ్చన్నారు.
కూసుమంచి, జనవరి 7: తగ్గిన పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం, సాగర్ జలాల రాక, రిజర్వాయర్పై ఆధారపడిన తాగునీటి అవసరాలపై హైదరాబాద్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి ఇరిగేషన్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్శాఖ ఈఎన్సీ మురళీధర్రావుతో కలిసి సమస్యల పరిష్కారంపై చర్చించారు. ప్రస్తుతం సాగర్లో ఫిబ్రవరి మొదటి వారం వరకు మాత్రమే జలాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై సమాలోచనలు చేశారు. మిషన్ భగీరథకు నీటికొరత లేకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఖమ్మం చీఫ్ ఇంజినీర్ విద్యాసాగర్, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.