జనావరణాలు.. జలావరణమయ్యాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి. ఎగువన కురిసిన వర్షంతో వరద మున్నేరును ముంచెత్తింది. ముంపు ప్రాంతంలోని ఇళ్లను జల దిగ్బంధం చేయగా.. భద్రాచలం వద్ద గోదారమ్మ బుధవారం రాత్రి వరకు ప్రమాద హెచ్చరికను దాటి గురువారం నుంచి శాంతిబాట పట్టింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా పడిన వర్షం గురువారం తెల్లవారుజామున తగ్గిపోయింది. రిజర్వాయర్లు సామర్థ్యానికి మించిన నీటితో పరవళ్లు తొక్కుతుండగా.. అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. చెరువులు, కుంటలు, వాగులు పొంగి ప్రవహిస్తూ.. ప్రజా, రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగించాయి. మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎక్కడికక్కడ హెచ్చరికలు జారీ చేస్తూ ప్రాణనష్టం వాటిల్లకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. మూడు రోజులుగా కురిసిన వర్షానికి ఉమ్మడి జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది.
– ఖమ్మం జూలై 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం జూలై 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లాపై వరుణుడు గర్జించడంతో జల ప్రళయం వచ్చినట్లయింది. ఏకధాటిగా బుధవారం రాత్రి గురువారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి రెండు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. చెరువులు, కుంటలు అలుగుపోశాయి. గడిచిన 24 గంటల్లో(బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా సరాసరి 169.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కరకగూడెం మండలంలో చరిత్రను తిరగరాసే విధంగా ఒక్కరోజులోనే 383.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 12.25 సెంటీమీటర్ల వర్షపాతం 17 మండలాల్లో నమోదు కావడం విశేషం. జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షం, ఎగువన కురిసిన వర్షానికి భద్రాచలం వద్ద గోదావరి నదిపై వరద ఉధృతి 51 అడుగులకు చేరింది.
అధికారులు రెండో ప్రమాద సూచిక ఎగురవేశారు. తాలిపేరు, కిన్నెరసాని రిజర్వాయర్లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా సరాసరి 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సింగరేణి మండలంలో 186.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాలేరు జలశయానికి గురువారం సాయంత్రం వరకు లక్ష క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ఎగువన కురిసిన అతి భారీ వర్షాలకు మున్నేరు నది 30 అడుగుల మేర పొంగి ప్రవహించింది. ఖమ్మం నగరం త్రీటౌన్లోని ముంపు ప్రాంతాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కలెక్టర్ వీపీ గౌతమ్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఖమ్మం రూరల్ మండలంలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు పర్యటించారు. కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ములకలపల్లి మండలంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, కలెక్టర్ ప్రియాంక ఆల, ఎస్పీ వినీత్లు ఆయా మండలాల్లో పర్యటించారు.
ఉగ్ర మున్నేరు
ఖమ్మం, జూలై 27 : మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురిసిన వర్షాలతో నీరు ఎక్కువగా చేరుకోవడంతో ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. ఖమ్మం నగరాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న మున్నేరు నీటి ప్రవాహం గురువారం సాయంత్రం 3 గటలకు 30 అడుగులకు చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరిక 16 అడుగులు, రెండో హెచ్చరిక 24 అడుగులకు ఉండగా.. సాయంత్రం వరకే 30 అడుగులకు చేరుకుంది. నీటి ఉధృతి పెరుగుతుండడంతో రాత్రి పరిస్థితి ఎలా ఉంటుందోనని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బుధవారం సాయంత్రం 6 గంటలకు 14.4 అడుగులు ఉండగా.. రాత్రి 10 గంటలకు 15.5 అడుగులకు చేరింది. గురువారం ఉదయం 6 గంటలకు 22.5 అడుగులు, 9.30 గంటలకు 27.5 అడుగులు, 11.45 గంటలకు 28.5 అడుగులు, మధ్యాహ్నం ఒంటిగంటకు 29 అడుగులు, 2.28 గంటలకు 29 అడుగులు, 3 గంటలకు 30 అడుగులకు చేరింది.1984, 2004లో మున్నేరుకు భారీ స్థాయిలో వరదలు వచ్చినప్పటికీ వాటికి మించి వరద రావడం ఇదే ప్రథమమని స్థానికులు పేర్కొంటున్నారు.