ఖమ్మం, నవంబర్ 9: చిన్నప్పటి నుంచి తాను ఖమ్మం లోకల్ అని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాన్లోకల్ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోని ఎంబీ ఫంక్షన్ హాల్లో గురువారం స్థానికుడు మేకల భిక్షమయ్య అధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తుమ్మల గతంలో ఎక్కడెక్కడ పోటీ చేశారో, ఎక్కడెక్కడ రాజకీయాలు చేశారో ప్రజలు గమనించాలన్నారు. తానెప్పుడు ఖమ్మంలోనే ఉన్నానని స్పష్టం చేశారు. తన హయాంలో జరిగిన అభివృద్ధిని తుమ్మల చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
గెలిచినా, ఓడినా తాను ఖమ్మంలోనే ఉంటానన్నారు. తుమ్మల ఎక్కడ ఉంటారో ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాలేరులో చెల్లని రూపాయిగా ఆయన్ను పక్కన పెట్టారని, ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. ఓడిపోతారనే భయంతో తుమ్మల తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడున్నారని పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉండి కూడా తుమ్మల తన స్థాయిని నిలుపుకోలేకపోతున్నారన్నారు. ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్తారన్నారు. సమావేశంలో నాయకులు బుడిగం శ్రీనివాస్, గడ్డపనేని సాంబశివ రావు, పారా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వర్లు, జకుల లక్ష్మయ్య, అమరగాని వెంకన్న, డోకుపర్తి సుబ్బారావు, వెంకటరమణ పాల్గొన్నారు.