ఖమ్మం, మార్చి 19 : అర్హులైన పేదలందరికీ ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని 57వ డివిజన్ వికలాంగుల కాలనీలో 460 మంది పేదలకు ఇండ్ల పట్టాలను కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేటివరకు దరఖాస్తు చేసుకోని వారికోసం జీవో నంబర్ 58, 59ను పొడిగిస్తూ మరో అవకాశం కల్పించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మేలు చేసేందుకు 58, 59 జీవోలను తీసుకొచ్చిందని, ఖమ్మం నగరంలో ప్రభుత్వ స్థలంలో తాతాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసాలకు పూర్తిహకు కల్పిస్తూ పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు.
పేదలందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో మంత్రులందరూ కలిసి ఈ జీవోలను పొడిగించాలని విజ్ఞప్తి చేయగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఖమ్మం నగరంలో 2వేల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి పేదలకు అందజేశామని పేర్కొన్నారు. ఇండ్లు లేనివారికి సొంత స్థలం కలిగిఉంటే రూ.3 లక్షలు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామన్నారు. పేదల పట్ల ప్రభుత్వం ఎంతో చిత్తుశుద్ధితో వ్యవహరిస్తున్నదన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ జీవో నంబర్ 58, 59 పథకం కింద 2,500 మంది పేదలకు పెద్దఎత్తున పట్టాలను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, అదనపు కలెక్టర్ మధుసూదన్, మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకుడు పరశురాం, అర్బన్ తహసీల్దార్ శైలజ తదితరులు పాల్గొన్నారు.