ఖమ్మం, జనవరి 8: కట్టంగూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం ఖిల్లా ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతిచెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆదివారం ఖిల్లాలోని వారి ఇండ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రమాదంలో మృతిచెందిన ఎండీ ఇద్దాక్, ఎస్కే సమీర్, ఎస్కే యాసీన్కు నివాళి అర్పించారు.
చిన్న వయస్సులో యువకులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. ఆయా కుటుంబాలను ఆదుకుంటామన్నారు. మృతులంతా పేదవారు కావడంతో వ్యక్తిగతంగా తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేలను మంత్రి ప్రకటించగా ఆయా నగదును తన వ్యక్తిగత సహాయకుడు సీహెచ్ రవికరణ్ ఆయా కుటుంబ సభ్యులకు అందజేశారు. వారి వెంట సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కార్పొరేటర్ అలియా షౌకత్ అలీ, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్, మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్, తౌసిప్, అక్మల్ అలీ, జిలాని, కాఫిల్, ఇసాక్, ఇజార్, జియాఉద్దీన్, అఫ్సర్, వసీం, సలీం తదితరులు ఉన్నారు.