మోదీ డౌన్ డౌన్ అంటూ హోరెత్తిన నినాదాలు
ప్రధాని దిష్టిబొమ్మలతో శవయాత్ర, దహనాలు
ద్విచక్రవాహన ర్యాలీలు, మానవహారాలు
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వెల్లువెత్తిన నిరసనలు
తెలంగాణలో అభివృద్ధిని చూస్తే బీజేపీకి కడుపు మండుతున్నది. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నది. విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నది. పదే పదే విషం కక్కుతున్నది. రాజ్యసభ సాక్షిగా ప్రధాని మోదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అవమానకరంగా విభజించారని వ్యాఖ్యలు చేయడంపై గులాబీ సేన భగ్గుమన్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం టీఆర్ఎస్ శ్రేణులు కన్నెర్ర చేశారు. ప్రధాని దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ద్విచక్ర వాహనాల ర్యాలీలు, మానవహారాలు చేపట్టి నిరసన తెలిపారు. ఖమ్మం నగరంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ద్విచక్రవాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ‘మోదీ డౌన్ డౌన్.. బీజేపీ హటావో.. దేశ్కి బచావో’ నినాదాలతో హోరెత్తింది. ఆయా నియోజకవర్గాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనలో పాల్గొన్నారు.
ఖమ్మం, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంపై అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ప్రధాని మోదీ వైఖరీని నిరసిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. తెలంగాణ ప్రజలకు ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. పలు చోట్ల మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు నేతృత్వంలో నల్ల రిబ్బన్లు ధరించి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. తరువాత ప్రధాని మోదీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జూలూరుపాడులో టీఆర్ఎస్ నాయకులు, సత్తుపల్లిలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేశారు. అశ్వారావుపేటలో సూర్యాపేట – రాజమండ్రి జాతీయ రహదారి మందలపల్లి వద్ద స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, తల్లాడలో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ నాయకుడు జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. చింతకాని మండల కేంద్రంలో జరిగిన నిరసనలో ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైరాలో స్థానిక ఎమ్మెల్యే రాములునాయక్, మున్సిపల్ చైర్మన్ సూదగాని జయపాల్, మార్క్పెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ నిరసన వ్యక్తం చేశారు. కూసుమంచిలో మోదీ దిష్టిబొమ్మను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి దహనం చేశారు. మణుగూరులో టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆధ్వర్యంలో, భద్రాచలంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇల్లెందులోని జగదాంబ సెంటర్లో మోదీ వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నేతృత్వంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్, మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.